PVN Madhav: శత్రు దేశాలు కూడా మన దేశంపై దాడి చేసేందుకు భయపడుతున్నాయి: మాధవ్
బీజేపీ 47వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఏపీలో అత్యంత వైభవంగా జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గ్రామం, పట్టణంలో పార్టీ శ్రేణులు ఈ సంబరాలను ఘనంగా నిర్వహించాయి. విజయవాడలోని రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ప్రధాన కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పాల్గొని, పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కార్యకర్తలకు స్వీట్లు తినిపించి శుభాకాంక్షలు తెలిపిన పీవీఎన్ మాధవ్... బీజేపీ ప్రయాణాన్ని, సాధించిన విజయాలను గుర్తుచేసుకున్నారు. దేశంలో అవినీతి, అక్రమాలు, విచ్ఛిన్నకర శక్తులకు వ్యతిరేకంగా బీజేపీ నిరంతరం పోరాటం చేసిందని ఆయన తెలిపారు. పొత్తులతో ప్రభుత్వం ఏర్పాటు చేసే స్థాయి నుంచి, స్వయంగా సంపూర్ణ మెజారిటీతో అధికారంలోకి వచ్చేలా పార్టీ ఎదిగిందని కొనియాడారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక శత్రు దేశాలు కూడా భారతదేశంపై దాడి చేసేందుకు భయపడుతున్నాయని పేర్కొన్నారు.
గత పదేళ్లలో కుల, మత ఘర్షణలు లేని పాలనను బీజేపీ అందించిందని, 'సబ్ కా సాత్.. సబ్ కా వికాస్' నినాదంతో అందరినీ కలుపుకుని ముందుకు సాగుతున్నామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం అభివృద్ధిని లక్ష్యంగా చేసుకుని పనిచేస్తోందని మాధవ్ వివరించారు.
నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గ్రామ పంచాయతీల్లో ‘మన ఊరు.. మన జెండా’ పేరుతో బీజేపీ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. దీని ద్వారా పార్టీ సిద్ధాంతాలను, కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని నిర్ణయించారు.