Narendra Modi: కాంగ్రెస్ నేతలు రాజకీయ రాబందుల్లా తయారయ్యారు: ప్రధాని మోదీ ఫైర్

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా ఇంధన, భౌగోళిక రాజకీయ సవాళ్లు నెలకొన్నప్పటికీ, భారతదేశం స్థిరంగా ఉందని స్పష్టం చేశారు. మంగళవారం గుజరాత్‌లోని వావ్-థరాడ్‌లో రూ.19,800 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దేశ ఐక్యతను దెబ్బతీస్తూ, కాంగ్రెస్ వదంతులను ప్రచారం చేస్తోందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ నేతలు రాజకీయ రాబందుల్లా తయారయ్యారని మండిపడ్డారు.

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు, యుద్ధ పరిస్థితుల కారణంగా ప్రపంచ ఇంధన సరఫరాపై తీవ్ర ప్రభావం పడుతోందని మోదీ అన్నారు. "ప్రపంచంలోని ఎన్నో దేశాలు అస్థిరతను ఎదుర్కొంటున్నాయి. డీజిల్, పెట్రోల్, గ్యాస్ సమస్యలతో సతమతమవుతున్నాయి. అయితే, మన విజయవంతమైన విదేశాంగ విధానం, ప్రజల ఐక్యత వల్ల భారత్ ఈ పరిస్థితులను అదుపులో ఉంచగలిగింది" అని ఆయన వివరించారు. చిన్న దేశాల నుంచి అగ్రరాజ్యాల వరకు ఇంధన ధరలు 10 నుంచి 25 శాతం పెరిగాయని, కానీ భారత్ మాత్రం ఆ భారాన్ని ప్రజలపై పడనీయడం లేదని తెలిపారు.

ఈ వాస్తవాలను కాంగ్రెస్ చూడలేకపోతోందని మోదీ విమర్శించారు. "దేశానికి ఐక్యత అవసరమైన ఈ సమయంలో కొందరు రాజకీయాలు చేస్తున్నారు. ఇందులో కాంగ్రెస్ ముందుంది. ధైర్యం చెప్పాల్సిన చోట భయాన్ని, వదంతులను వ్యాపింపజేస్తున్నారు. రాజకీయ రాబందుల్లా దేశంలో గందరగోళం కోసం ఎదురుచూస్తూ, ఎన్నికల లబ్ధి పొందాలని చూస్తున్నారు" అని ఆయన తీవ్రంగా ఆక్షేపించారు. ఇంధన ధరల విషయంలోనూ ప్రజలను క్యూలలో నిలబెట్టి లబ్ధి పొందాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

ఈ సందర్భంగా డీసా ఎయిర్‌బేస్‌ను ప్రారంభించడంపై మోదీ సంతోషం వ్యక్తం చేశారు. "ఈ ఎయిర్‌బేస్ అంతర్జాతీయ సరిహద్దుకు కేవలం 130 కిలోమీటర్ల దూరంలో ఉంది. దేశ భద్రతకు ఇది చాలా కీలకం" అని ఆయన పేర్కొన్నారు. తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ ప్రాజెక్టుకు భూసేకరణ జరిగిందని గుర్తుచేశారు. "అప్పుడు ఢిల్లీలో అధికారంలో ఉన్నవారికి గుజరాత్‌పై ఎందుకో ద్వేషం. ఏళ్ల తరబడి ఫైళ్లను తొక్కిపెట్టి ప్రాజెక్టును అడ్డుకున్నారు. మీరు నన్ను ఢిల్లీకి పంపిన తర్వాత ఆ ఫైళ్లను బయటకు తీసి, ఈ ఎయిర్‌బేస్‌ను పూర్తి చేశాను" అని మోదీ తెలిపారు. ఈ ఆలస్యానికి కాంగ్రెస్ వైఖరే కారణమని, దేశ భద్రత విషయంలో వారి ప్రవర్తనను జాతి ఎప్పటికీ క్షమించదని అన్నారు.

ఇటీవల ఢిల్లీలో జరిగిన గ్లోబల్ ఏఐ సమ్మిట్‌లో ప్రపంచ దేశాలు భారత్‌ను ప్రశంసిస్తుంటే, కాంగ్రెస్ నేతలు మాత్రం దేశ ప్రతిష్ఠను దెబ్బతీయాలని చూశారని మోదీ ఆరోపించారు. భారత్‌కు వ్యతిరేకంగా మాట్లాడే శక్తుల మాదిరిగా కాంగ్రెస్ మాట్లాడుతోందని విమర్శించారు. కోవిడ్ మహమ్మారి సమయంలో చూపిన ఐక్యతను ఇప్పుడు కూడా ప్రదర్శించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఉత్తర గుజరాత్ అభివృద్ధికి దోహదపడే ఈ ప్రాజెక్టుల ప్రారంభోత్సవం, దేశీయ, అంతర్జాతీయ సవాళ్లను భారత్ ఎలా ఎదుర్కొంటుందో చెప్పడానికి నిదర్శనమని ఆయన తన ప్రసంగాన్ని ముగించారు.
Narendra Modi
Congress Party
Gujarat
Fuel Prices
Global AI Summit
Deesa Airbase
Indian Economy
Political vultures
Foreign policy
Development projects

More Telugu News