Mahan Air: ఇరాన్‌పై అమెరికా దాడి.. భారత్ రావాల్సిన ఇరాన్ విమానం ధ్వంసం

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల నడుమ ఇరాన్‌లోని మషద్ విమానాశ్రయంలో సోమవారం తీవ్ర పరిణామం చోటుచేసుకుంది. అమెరికా జరిపినట్లుగా చెబుతున్న వైమానిక దాడిలో 'మహాన్ ఎయిర్' సంస్థకు చెందిన ఓ విమానం ధ్వంసమైంది. భారత్ నుంచి మానవతా సాయంగా అందాల్సిన వైద్య సామాగ్రిని తీసుకెళ్లేందుకు సిద్ధమైన విమానంపై దాడి జరగడం ఆందోళన కలిగిస్తోంది.

ఈ విమానం ఏప్రిల్ 1న న్యూఢిల్లీకి చేరుకుని, ఇరాన్ ప్రజల కోసం అవసరమైన వైద్య సామగ్రిని, ఇతర అత్యవసర వస్తువులను తీసుకెళ్లాల్సి ఉంది. అయితే, మషద్ విమానాశ్రయంలో జరిగిన ఈ దాడిలో విమానం దెబ్బతినడంతో భారత్ నుంచి సహాయాన్ని స్వీకరించే కార్యక్రమంపై నీలినీడలు కమ్ముకున్నాయని ఇరాన్ అధికారులు తెలిపారు. ఈ దాడితో తమ మిషన్‌కు తీవ్ర ఆటంకం ఏర్పడిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

ఇప్పటికే మార్చి 18న భారత్ తొలి విడత వైద్య సహాయాన్ని ఇరానియన్ రెడ్ క్రెసెంట్ సొసైటీ ద్వారా ఇరాన్‌కు పంపింది. ఈ సహాయం పట్ల న్యూఢిల్లీలోని ఇరాన్ రాయబార కార్యాలయం భారత ప్రభుత్వానికి, ప్రజలకు కృతజ్ఞతలు కూడా తెలిపింది. మహాన్ ఎయిర్ అనేది పశ్చిమాసియా, మధ్య ఆసియా, దక్షిణాసియాలో సేవలు అందిస్తున్న ఒక ప్రైవేట్ విమానయాన సంస్థ. కాగా, ఈ వైమానిక దాడిని అమెరికా అధికారులు ఇప్పటివరకు అధికారికంగా ధ్రువీకరించలేదు.
Mahan Air
Iran
America attack
Mashhad Airport
India humanitarian aid
medical supplies
US air strike
Iran Red Crescent Society
New Delhi
West Asia tensions

More Telugu News