Atchannaidu: గతంలో అబద్ధాలను అడ్డుకోలేక ఓడిపోయాం: అచ్చెన్నాయుడు
గతంలో తాము అభివృద్ధి చేయక ఓడిపోలేదని, వైసీపీ ప్రచారం చేసిన అబద్ధాలను సమర్థవంతంగా అడ్డుకోలేక ఓటమి పాలయ్యామని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. మూలపేట పోర్టు నిర్మాణంపై మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, ఇతర వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలకు ఆయన గట్టి కౌంటర్ ఇచ్చారు. ఈసారి అబద్ధాలకు తావులేదని, ప్రతి తప్పుడు ప్రచారాన్ని క్షేత్రస్థాయిలో ఎండగడతామని చెప్పారు.
జగన్ హయాంలోనే మూలపేట పోర్టు పనులు 70 శాతం పూర్తయ్యాయని వైసీపీ నేతలు చెబుతున్న మాటలపై అచ్చెన్నాయుడు విమర్శలు గుప్పించారు. "70 శాతం పనులు పూర్తయ్యాయని దొంగ పేపర్లు, దొంగ ఛానళ్లలో ప్రచారం చేసుకోవడం మీకు అలవాటైపోయింది. మరి అంత శాతం పనులు పూర్తయితే అక్కడకు షిప్పులు ఎందుకు రావట్లేదో సమాధానం చెప్పాలి" అని ఆయన డిమాండ్ చేశారు. అవగాహన లేని వారు మాట్లాడితే వదిలేయవచ్చు కానీ, సీనియర్ నేతలు కూడా పచ్చి అబద్ధాలు మాట్లాడటం దారుణమన్నారు. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో మూలపేట పోర్టును త్వరితగతిన పూర్తి చేసి జిల్లా ముఖచిత్రాన్ని మారుస్తామని చెప్పారు.