Nestle: కిట్‌క్యాట్‌కు హైటెక్ దొంగల షాక్.. రూ.1.5 కోట్ల చాక్లెట్ల కంటెయినర్ చోరీ

ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన కిట్‌క్యాట్ చాక్లెట్ తయారీ సంస్థ నెస్‌లేకు దొంగలు భారీ షాక్ ఇచ్చారు. ఇటలీ నుంచి పోలాండ్‌కు తరలిస్తున్న సుమారు రూ. 1.5 కోట్ల విలువైన చాక్లెట్ల షిప్‌మెంట్‌ను అత్యంత చాకచక్యంగా హైజాక్ చేశారు. ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన నెస్‌లే, అంతర్జాతీయ దర్యాప్తు సంస్థల సహాయం కోరింది.

ఈ చోరీ జరిగిన తీరు ఓ సినిమా స్క్రీన్‌ప్లేను తలపిస్తోంది. దొంగలు నకిలీ రవాణా పత్రాలు, ఫేక్ ఐడెంటిటీ కార్డులను సృష్టించారు. అసలైన డ్రైవర్ యూనిట్‌కు చేరుకోకముందే, పక్కా ప్రణాళికతో వీరు ఫ్యాక్టరీకి చేరుకున్నారు. అక్కడి లోడింగ్ సిబ్బందిని మాటలతో నమ్మించి, కిట్‌క్యాట్ చాక్లెట్లతో నిండిన భారీ ట్రక్కును తీసుకుని అక్కడి నుంచి ఉడాయించారు.

ఇటలీ సరిహద్దు దాటిన కొద్దిసేపటికే ట్రక్కు జీపీఎస్ సిగ్నల్ పనిచేయడం ఆగిపోయింది. దొంగలు సిగ్నల్స్‌ను నిలిపివేయడానికి హైటెక్ జామర్లను ఉపయోగించి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. అటు ట్రక్కు, ఇటు చాక్లెట్ల లోడ్ రెండూ కనిపించకుండా పోవడంతో ఇటలీ, జర్మనీ, పోలాండ్ పోలీసులు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టారు.

ఈ ఘటన తమ సరఫరా వ్యవస్థపై జరిగిన వ్యవస్థీకృత దాడి అని నెస్‌లే ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ భారీ నష్టం కారణంగా పోలాండ్, తూర్పు యూరప్ మార్కెట్లలో కిట్‌క్యాట్ సరఫరాకు తాత్కాలికంగా అంతరాయం ఏర్పడవచ్చని తెలుస్తోంది. సాధారణంగా ఎలక్ట్రానిక్స్ వంటి ఖరీదైన వస్తువులను లక్ష్యంగా చేసుకునే అంతర్జాతీయ ముఠాలు, ఇప్పుడు ఆహార పదార్థాలపై పడటం ఆందోళన కలిగిస్తోంది. ఈ చాక్లెట్లను బ్లాక్ మార్కెట్‌లో విక్రయించేందుకే ఈ చోరీకి పాల్పడి ఉంటారని అధికారులు భావిస్తున్నారు.
Nestle
KitKat
Kit Kat
chocolate theft
Italy
Poland
crime
truck hijacking
supply chain
international crime

More Telugu News