Nadendla Manohar: చంటి బిడ్డలతో మహిళల పోరాటం మరువలేనిది: నాదెండ్ల మనోహర్
అమరావతి రాజధాని కోసం పోరాడుతున్న రైతులను పరామర్శించేందుకు జనసేన అధినేత, పవన్ వస్తుంటే గత ప్రభుత్వం ముళ్ల కంచెలు వేసి అడ్డుకున్న తీరును నాదెండ్ల మనోహర్ గుర్తు చేశారు. ప్రజాస్వామ్యంలో ఒక నాయకుడిని ప్రజల వద్దకు వెళ్లకుండా ఇబ్బంది పెట్టడం అత్యంత దారుణమని ఆయన మండిపడ్డారు.
రాష్ట్ర విభజనతో జరిగిన తీరని నష్టాన్ని పూడ్చుకునేందుకు రాజధాని కోసం అమరావతి రైతులు తమ భూములను త్యాగం చేశారని... అమరావతి అనేది కేవలం ఒక ప్రాంతం కాదు, అది రాష్ట్ర ప్రజలందరి మనోభావాలకు సంబంధించిన విషయమని నాదెండ్ల పేర్కొన్నారు. మూడు రాజధానుల పేరుతో జగన్ చేసిన అరాచకాలు, రాష్ట్ర అభివృద్ధిని వెనక్కి నెట్టాయని ఆయన విమర్శించారు.
స్వతంత్ర భారత చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా అమరావతి రైతులు దాదాపు 1631 రోజులు నిరంతరాయంగా పోరాటం చేశారని నాదెండ్ల కొనియాడారు. రాజ్యాంగ ప్రక్రియను విస్మరించి గత ప్రభుత్వం తీసుకున్న తుగ్లక్ నిర్ణయాలపై మహిళలు చంటి బిడ్డలను ఎత్తుకుని రోడ్లపైకి వచ్చి చేసిన పోరాటం మరువలేనిదని ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. రాజధాని అమరావతిపై చట్టబద్ధత తీర్మానం ఆ రైతుల త్యాగాలకు దక్కిన గౌరవమని అన్నారు.