Air India: పశ్చిమాసియాకు ఆగని విమానాలు.. 72 సర్వీసులు నడుపుతున్న ఎయిర్ ఇండియా

Air India Continues West Asia Flights Amidst Tensions
పశ్చిమాసియాలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ, ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమాన సేవలను కొనసాగిస్తున్నాయి. ఆదివారం (మార్చి 15) ఒక్కరోజే పశ్చిమాసియా దేశాలకు, అక్కడి నుంచి భారత్‌కు కలిపి మొత్తం 72 షెడ్యూల్డ్, నాన్-షెడ్యూల్డ్ విమానాలను నడపనున్నట్లు ఈ సంస్థలు ప్రకటించాయి.

జెడ్డా, మస్కట్ నగరాలకు షెడ్యూల్డ్ సర్వీసులు యథావిధిగా నడుస్తాయని ఎయిర్ ఇండియా తెలిపింది. భారత్, జెడ్డాల మధ్య మొత్తం 8 విమానాలు రాకపోకలు సాగిస్తాయి. ఇందులో భాగంగా ఢిల్లీ, ముంబైల నుంచి ఎయిర్ ఇండియా ఒక్కో సర్వీసును, బెంగళూరు, కోజికోడ్‌ల నుంచి ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఒక్కో సర్వీసును నడుపుతాయి. అదేవిధంగా మస్కట్‌కు ఢిల్లీ, కొచ్చి, కోజికోడ్, మంగళూరు, ముంబై, తిరువనంతపురం నుంచి 12 షెడ్యూల్డ్ విమానాలు నడుస్తాయి. ఇవి కాకుండా, యూఏఈ, సౌదీ అరేబియాలకు 52 నాన్-షెడ్యూల్డ్ విమానాలను కూడా నడపనున్నట్లు సంస్థ వెల్లడించింది. సంబంధిత భారత, స్థానిక అధికారుల నుంచి అవసరమైన అన్ని అనుమతులు తీసుకున్నామని పేర్కొంది.

మరోవైపు, పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF) ధరలు పెరగడంతో విమానయాన సంస్థలు ప్రయాణికులపై ఫ్యూయల్ సర్‌చార్జ్ విధిస్తున్నాయి. ఎయిర్ ఇండియా, ఇండిగోల బాటలోనే ఆకాశ ఎయిర్ కూడా ఈ భారాన్ని మోపింది. దేశీయ, అంతర్జాతీయ రూట్లలో రూ.199 నుంచి రూ.1,300 వరకు సర్‌చార్జ్ వసూలు చేయనున్నట్లు ఆకాశ ఎయిర్ ప్రకటించింది. మార్చి 14 నుంచి ఇండిగో రూ.425 నుంచి రూ.2,300 వరకు సర్‌చార్జ్ విధిస్తుండగా, మార్చి 12 నుంచే ఎయిర్ ఇండియా గ్రూప్ దేశీయ విమానాల్లో ఒక్కో టికెట్‌పై రూ.399 సర్‌చార్జ్‌ను అమల్లోకి తెచ్చింది. 
Air India
Air India flights
West Asia flights
Middle East flights
Jeddah flights
Muscat flights
Aviation Turbine Fuel
Fuel Surcharge
Indigo
Akasa Air

More Telugu News