Indigo: ప్రయాణికులపై ఫ్యూయల్ ఛార్జ్ భారం.. ఇండిగో నిర్ణయం

Indigo Imposes Fuel Surcharge on Flight Tickets
ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావం అన్ని రంగాలపై పడింది. పశ్చిమాసియా ఉద్రికతల కారణంగా విమాన ఇంధన ధరలు భారీగా పెరగడంతో ప్రయాణికులపై ఆ భారం పడుతోంది. ఇప్పటికే విమాన ఛార్జీలు పెరగగా, తాజాగా ఫ్యూయల్ ఛార్జీ పేరిట కొత్త ఛార్జీలను వసూలు చేస్తున్నాయి. ఇప్పటికే ఎయిరిండియా టిక్కెట్ ధరలపై సర్‌ఛార్జ్ వేస్తోంది. తాజాగా ఇండిగో ఫ్యూయల్ ఛార్జ్ వసూలు చేయాలని నిర్ణయించింది.

ఇండిగో విమానయాన సంస్థ ఫ్యూయల్ సర్‌ఛార్జ్ పేరిట ఒక్కో టిక్కెట్‌పై రూ.425 నుంచి రూ.2,300 వరకు వసూలు చేయనుంది. రేపటి నుంచి ఈ ఛార్జీలు అమల్లోకి వస్తాయని తెలిపింది. ఫ్యూయల్ ఛార్జ్ వసూలు విషయానికి వస్తే, దేశీయ ప్రయాణ టిక్కెట్లపై రూ.425, మధ్యప్రాచ్యం వెళ్లే విమాన టిక్కెట్‌పై రూ.900, ఆగ్నేయాసియా, చైనా, పశ్చిమాసియాకు వెళ్లే విమానాల టిక్కెట్‌పై రూ.1,800, యూరప్ వెళ్లే విమానాల్లో ఒక్కో టిక్కెట్‌పై రూ.2,300 చొప్పున ఫ్యూయల్ ఛార్జీని ఇండిగో వసూలు చేయనుంది.

విమానయాన సంస్థల నిర్వహణ వ్యయాల్లో 40 శాతం వరకు ఇంధనం వాటా ఉంటుంది. ఇప్పుడు అంతర్జాతీయంగా ఏటీఎఫ్ ధరలు పెరగడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రయాణికులపై కొంత భారం మోపాల్సి వచ్చిందని ఇండిగో విమానయాన సంస్థ తన ప్రకటనలో తెలిపింది.
Indigo
Indigo Airlines
Fuel Surcharge
Air India
Aviation Fuel Price Hike
Air Travel
Flight Tickets

More Telugu News