Chandrababu Naidu: బాణసంచా ప్రమాదం, పాల కల్తీ ఘటనలు బాధించాయి: చంద్రబాబునాయుడు

Chandrababu Naidu Distressed by Firecracker Accident Milk Adulteration
  • ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్న ముఖ్యమంత్రి
  • బాధ్యత అధికారుల పైనే ఉందన్న ముఖ్యమంత్రి
  • కలెక్టర్లు, సెక్రటరీలు ఫీల్డ్ విజిట్స్ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశం
శ్రీకాకుళంలో డయేరియా, రాజమహేంద్రవరంలో కల్తీపాలు, వేట్లపాలెంలో బాణసంచా లాంటి ఘటనలు బాధాకరమని ఆయన అన్నారు. ప్రజల ప్రాణాలు లెక్కచేయకుండా ఎవ్వరు వ్యవహరించినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. స్వార్థపరుల చేతుల్లోకి పరిస్థితులు వెళ్లడానికి వీల్లేదని, అలాంటి విషయంలో ఉదాసీనంగా ఉండబోమని స్పష్టం చేశారు. నీరు కలుషితం, పాలు కల్తీ అవుతుంటే ఆయా విభాగాలు ఏం చేస్తున్నాయని నిలదీశారు.

జిల్లాల కలెక్టర్లు కనీసం 8 రోజులు క్షేత్రస్థాయిలో పర్యటించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. సీనియర్ సెక్రటరీలు, నాలుగు రోజులపాటు క్షేత్రస్థాయిలో వెళ్లాలని అన్నారు. దీనిపై పోర్టల్ తయారు చేసి ఆన్‌లైన్‌లో పెట్టేలా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బాధ్యత తీసుకోవాలని అన్నారు. క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాల్సింది కలెక్టర్లేనని అన్నారు. ఈ విషయంలో ఎలాంటి రాజీ లేదని స్పష్టం చేశారు.

ప్రతి విషయంలో నిజానిజాలు తెలుసుకున్న తర్వాత తగిన నిర్ణయాలు తీసుకునే బాధ్యత కలెక్టర్లదే అన్నారు. సంజీవిని ప్రాజెక్టును సమర్థంగా రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని పిలుపునిచ్చారు. 72 లక్షల మందికి వివిధ ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు స్క్రీనింగ్‌లో తేలిందని తెలిపారు. ప్రతి ఇంటికి సురక్షిత మంచినీరు అందించాలని ఆదేశించారు. గత పాలకులు చేసిన తప్పు వల్ల జేజేఎం (జల్ జీవన్ మిషన్) కింద నిధులు కోల్పోయామని ఆయన అన్నారు.

శాశ్వత పరిష్కారంగా ప్రాజెక్టులు పూర్తి చేసి ఉండాల్సిందని ముఖ్యమంత్రి అన్నారు. కేవలం రూ.2 వేల కోట్లు మాత్రమే జేజేఎం కింద గత ప్రభుత్వం ఖర్చు చేసిందని అన్నారు. ఈ ప్రాజెక్టును కొనసాగించాలని కేంద్రాన్ని కోరామని, అందుకు అంగీకరించిందని అన్నారు. పాత స్కీంను 28 వేల కోట్లను ఖర్చు చేసేలా 2028 వరకు కేంద్రం పొడిగించిందని హర్షం వ్యక్తం చేశారు. ప్రతి ఇంటికి సురక్షిత తాగునీరు అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. రాబోయే రెండేళ్లలో జేజేఎం పథకాన్ని పూర్తి చేసుకుని ప్రతి ఇంటికి కుళాయి ఇవ్వాలని లక్ష్యంగా పెట్టారు.

పైప్ లైన్లు వేయడం కోసం రోడ్లను తవ్వేసి మళ్లీ సరిచేయకుండా వదిలేస్తున్నారని ముఖ్యమంత్రి అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి నిర్లక్ష్యాన్ని సహించేది లేదని అన్నారు. మేజిక్ డ్రెయిన్లను కూడా వేగంగా పూర్తి చేయాలని, ఫైబర్ గ్రిడ్ ద్వారా ఇంటర్నెట్‌ను ఇవ్వాలని ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు. ఉగాదికి 2.50 లక్షల మందికి, జూన్ నెలలో మరికొందరు లబ్ధిదారులకు ఇళ్లు ఇవ్వాలని అన్నారు. వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు కూడా అమల్లోకి వస్తున్నాయని తెలిపారు. ఇంటింటికీ చెత్త సేకరణ కార్యక్రమం చేపట్టాలని ఆయన సూచించారు. స్వచ్ఛ సర్వేక్షణ్ మార్చి 15వ తేదీ నాటికి ప్రారంభమవుతుందని అన్నారు. కనీసం 50 మున్సిపాలిటీలకు అవార్డులు రావాలని అన్నారు.
Chandrababu Naidu
Andhra Pradesh
Srikakulam
Rajamahendravaram
firecracker accident
milk adulteration

More Telugu News