అందరికీ నీతులు చెప్పే ప్రకాశ్ రాజ్ ఇలాంటి చర్యలకు పాల్పడడం విడ్డూరంగా ఉంది: విష్ణువర్ధన్ రెడ్డి
- నటుడు ప్రకాశ్ రాజ్పై ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి తీవ్ర ఆరోపణలు
- ధర్మస్థలం పవిత్రతను దెబ్బతీసేందుకు కుట్ర పన్నారని విమర్శ
- కేరళ నుంచి రూ.200 కోట్లతో దుష్ప్రచారం చేశారని ఆరోపణ
- నిజాలు తేలాలని, దోషిగా తేలితే చట్టప్రకారం శిక్షించాలని డిమాండ్
ధర్మస్థలానికి వ్యతిరేకంగా తప్పుడు ప్రచారం చేసేందుకు నటుడు ప్రకాశ్ రాజ్ కేరళ నుంచి ఏకంగా రూ.200 కోట్లు ఖర్చు చేశారని 'చిన్నయ్య' అనే వ్యక్తి ఆరోపించిన విషయాన్ని విష్ణువర్ధన్ రెడ్డి ప్రస్తావించారు. తరచూ ఇతరులకు నైతికత, ప్రజాస్వామ్యం గురించి ఉపన్యాసాలు ఇచ్చే ప్రకాశ్ రాజ్ ఇలాంటి చర్యలకు పాల్పడటం విడ్డూరంగా ఉందన్నారు.
ఈ వ్యవహారంలో నిజానిజాలు కచ్చితంగా బయటకు రావాలని ఆయన డిమాండ్ చేశారు. ఒకవేళ ఆరోపణలు రుజువైతే, ప్రకాశ్ రాజ్ ఎంత పెద్ద నటుడైనా సరే చట్టం నుంచి తప్పించుకోలేరని స్పష్టం చేశారు. సెలబ్రిటీ హోదా అనేది చట్టపరమైన చర్యల నుంచి రక్షణ కవచం కాకూడదని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ఆరోపణల నేపథ్యంలో పూర్తిస్థాయి విచారణ జరిపి వాస్తవాలను నిగ్గు తేల్చాలని విష్ణువర్ధన్ రెడ్డి కోరారు.