Trisha: మైక్ దొరికింది కదా అని వాగితే అది తెలివి కాదు.. మూర్ఖత్వం!: త్రిష ఫైర్

Trisha Fires Back at Critics Comments
  • ఇటీవల విజయ్ తో కలిసి పెళ్లి రిసెప్షన్ కు హాజరైన త్రిష
  • త్రిషపై దర్శకుడు పార్థిబన్ చేసిన అనుచిత వ్యాఖ్యలు వైరల్
  • మైక్ పట్టుకున్నంత మాత్రాన తెలివైన వాళ్లు కారని త్రిష కౌంటర్
  • మూర్ఖత్వాన్ని బిగ్గరగా చెప్పడమే అవుతుందంటూ చురకలు
  • పార్థిబన్ పేరు ప్రస్తావించకుండానే త్రిష ఘాటు పోస్ట్
ప్రముఖ నటి త్రిష తాజాగా సోషల్ మీడియా వేదికగా చేసిన ఓ పోస్ట్ కోలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇటీవల తన గురించి జరిగిన ప్రచారం, ఓ కార్యక్రమంలో తనపై వచ్చిన వ్యాఖ్యలకు ఆమె పరోక్షంగా, ఘాటుగా సమాధానం ఇచ్చారు. ఎవరి పేరునూ ప్రస్తావించకపోయినా, దర్శకుడు పార్థిబన్ చేసిన వ్యాఖ్యలకే ఆమె ఈ కౌంటర్ ఇచ్చారని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

త్రిష తన పోస్ట్‌లో స్పందిస్తూ.. "ఒక వ్యక్తి తన అసిస్టెంట్ ద్వారా చెప్పడంతో.. చివరి నిమిషంలో నిర్వాహకులు నా పేరు, ఫొటోను ఓ ఈవెంట్ లో చేర్చారని నాకు తెలిసింది" అని పేర్కొన్నారు. అలాగే తనపై వచ్చిన విమర్శలకు గట్టిగానే బదులిచ్చారు. "చేతిలో మైక్ ఉన్నంత మాత్రాన ఎవరూ తెలివైన వాళ్లు అయిపోరు. మాట్లాడే మాటల్లో హాస్యం పండదు. అది కేవలం మూర్ఖత్వాన్ని మరింత గట్టిగా వినిపించేలా చేస్తుంది. అవగాహన లేకుండా, అసభ్యకరమైన పదాలు వాడటం.. అవతలి వ్యక్తి కంటే మాట్లాడే వారి సంస్కారాన్ని, విజ్ఞతను బయటపెడుతుంది" అని త్రిష మండిపడ్డారు.

ఈ వివాదానికి మూలం ఇటీవల జరిగిన ఓ అవార్డుల కార్యక్రమం. అక్కడ నటుడు, దర్శకుడు ఆర్. పార్థిబన్.. త్రిష ఫొటోను చూపిస్తూ ఆమె పోషించిన 'కుందవై' పాత్రను ఉద్దేశించి మాట్లాడారు. "ఈ కుందవైని కొద్ది రోజులు ఇంట్లోనే ఉంచాలి. బయటకు రానివ్వకూడదు. అదే మంచిది" అని వ్యాఖ్యానించారు. ఈ కామెంట్స్ పైనే త్రిష ఇప్పుడు స్పందించినట్లు తెలుస్తోంది.

కాగా, ఇటీవల నటుడు, రాజకీయ నాయకుడు విజయ్ దళపతితో కలిసి త్రిష ఓ వెడ్డింగ్ రిసెప్షన్ కు హాజరయ్యారు. విజయ్ భార్య విడాకుల పిటిషన్ వేశారని వార్తలు వస్తున్న నేపథ్యంలో.. విజయ్, త్రిష జంటగా వేదికపైకి వెళ్లడం, ఫొటోలకు పోజులివ్వడం, ఒకే సమయంలో అక్కడి నుంచి వెళ్లడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సంఘటన తర్వాతే పార్థిబన్ ఆ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.


Trisha
Trisha Krishnan
Kollywood
P Parthiban
Kundaavi
Vijay Thalapathy
Divorce Rumors
Tamil Cinema
Actress Controversy

More Telugu News