Revanth Reddy: త్వరలోనే తెలంగాణలో ఉచిత స్కూటీలు: సీఎం రేవంత్ రెడ్డి

Revanth Reddy Announces Free Scooties for Telangana Students
  • విద్యార్థినులకు ఉచితంగా ఎలక్ట్రిక్ స్కూటీల పంపిణీ
  • 2026 డిసెంబర్ నాటికి హైదరాబాద్‌లో 100 శాతం ఎలక్ట్రిక్ బస్సులు
  • నగరంలోని డీజిల్ బస్సులు జిల్లాలకు తరలింపు
  • ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుపై జీరో ట్యాక్స్ విధానం
  • ప్రజాభవన్‌లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని విద్యార్థినులకు తీపి కబురు అందించారు. చదువుకునే ఆడబిడ్డల ప్రయాణ కష్టాలను తీర్చడంతో పాటు, వారిని ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం తరఫున ఉచితంగా ఎలక్ట్రిక్ స్కూటీలను పంపిణీ చేయనున్నట్లు ప్రకటించారు. ప్రజాభవన్‌లో ఘనంగా జరిగిన మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న సీఎం.. మహిళా సాధికారతకు సంబంధించి పలు కీలక నిర్ణయాలను వెల్లడించారు. ఎన్నికల హామీ మేరకు... త్వరలోనే ఈ ఉచిత స్కూటీల పథకాన్ని అమలు చేస్తామని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. మహిళలు అన్ని రంగాల్లో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. ఇప్పటికే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నామని, డ్వాక్రా సంఘాల ద్వారా రుణాలు, గృహలక్ష్మి పథకం ద్వారా సబ్సిడీ గ్యాస్ సిలిండర్లు అందిస్తూ ఆర్థికంగా అండగా నిలుస్తున్నామని గుర్తు చేశారు. ఇప్పుడు విద్యార్థినులకు ఉచిత స్కూటీలు ఇవ్వడం ద్వారా వారి విద్యకు, స్వావలంబనకూ మరింత తోడ్పాటు లభిస్తుందని పేర్కొన్నారు.

హైదరాబాద్‌కు కాలుష్య విముక్తి
నగరాన్ని కాలుష్యరహితంగా మార్చేందుకు మరో భారీ నిర్ణయాన్ని సీఎం ప్రకటించారు. హైదరాబాద్‌ను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దడంలో కాలుష్యమే పెద్ద అడ్డంకిగా మారిందని, ఇది నాన్ లివింగ్ సిటీగా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే 2026 డిసెంబర్ నాటికి హైదరాబాద్‌లో 100 శాతం ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు. డిసెంబర్ 9వ తేదీలోపు నగరంలో డీజిల్ బస్సులు కనిపించవని, ప్రస్తుతం ఉన్న డీజిల్ బస్సులన్నింటినీ జిల్లాలకు తరలిస్తామని తెలిపారు. నగర ప్రజల కోసం ఏసీ ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడతామన్నారు.

అంతేకాకుండా, నగరంలో తిరిగే పెట్రోల్, డీజిల్ ఆటోలను కూడా ఎలక్ట్రిక్ వాహనాలుగా మారుస్తామని చెప్పారు. ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేస్తే 'జీరో ట్యాక్స్' విధిస్తామని, ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న కాలుష్య కారక పరిశ్రమలను వెలుపలికి తరలిస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.

మహిళా జర్నలిస్టులకు సత్కారం
ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా మీడియా నిలుస్తోందని, ఆ వారధికి సారథులుగా ఉన్న మహిళా జర్నలిస్టులను సత్కరించుకోవడం సంతోషంగా ఉందని సీఎం అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ మహిళా జర్నలిస్టులను ఘనంగా సత్కరించారు. వివిధ రంగాల్లో ప్రతిభ చూపిన మహిళలకు, స్వయం సహాయక సంఘాల సభ్యులకు డిజిటల్ కరెన్సీ రూపంలో కానుకలు అందజేశారు. రెండేళ్ల ప్రజాపాలనలో వచ్చిన మార్పులకు ఆడబిడ్డలే ప్రత్యక్ష సాక్షులని, తన ప్రభుత్వానికి వారే బ్రాండ్ అంబాసిడర్లని సీఎం రేవంత్ రెడ్డి అభివర్ణించారు.
Revanth Reddy
Telangana
Free Scooties
Electric Scooters
Women Empowerment
International Womens Day
Hyderabad
Electric Buses
Zero Tax
Girl Students

More Telugu News