శ్రీశైలం అడవుల్లో ఎలివేటెడ్ కారిడార్.. 2 నుంచి 4 లేన్లకు విస్తరణ

Srisailam forest elevated corridor expansion from 2 to 4 lanes
  • నిర్మాణ పర్యవేక్షణ బాధ్యతలు ఎన్‌హెచ్‌ఏఐకి అప్పగింత
  • భవిష్యత్ అవసరాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
  • కొత్త ప్రతిపాదనలతో డీపీఆర్ సిద్ధం చేయనున్న అధికారులు
  • పెరగనున్న ప్రాజెక్టు వ్యయం, నిధుల సమీకరణపై త్వరలో భేటీ
శ్రీశైలం రిజర్వ్ ఫారెస్ట్ గుండా నిర్మించతలపెట్టిన ప్రతిష్ఠాత్మక ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని, ఇప్పటివరకు 2 లేన్లుగా నిర్మించాలనుకున్న ఈ ప్రాజెక్టును 4 లేన్లకు విస్తరించాలని ప్రాథమికంగా నిర్ణయించింది. ఇదే సమయంలో, ప్రాజెక్టు పనులను వేగవంతం చేసేందుకు పర్యవేక్షణ బాధ్యతలను కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ నుంచి భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్ఏఐ)కి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్-శ్రీశైలం జాతీయ రహదారి-765లో ఆమనగల్ నుంచి మన్ననూరు చెక్‌పోస్ట్ వరకు ఇప్పటికే ఎన్‌హెచ్‌ఏఐ పరిధిలో ఉండగా, మధ్యలోని 54 కిలోమీటర్ల అటవీ భాగం మాత్రమే కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వశాఖ పరిధిలో ఉండేది. దీనివల్ల సాంకేతిక విశ్లేషణలు, టెండర్ల ప్రక్రియలో జాప్యం జరుగుతోందని భావించిన కేంద్రం, సమగ్ర పర్యవేక్షణ కోసం మొత్తం మార్గాన్ని ఎన్‌హెచ్‌ఏఐకి అప్పగించింది. ఈ నేపథ్యంలో ఎన్‌హెచ్‌ఏఐ తెలంగాణ విభాగం అధికారులు, వైల్డ్‌లైఫ్‌ బోర్డు ప్రతినిధులతో కలిసి అటవీ ప్రాంతంలో క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టారు.

గతంలో 2 లేన్ల కారిడార్ నిర్మాణానికి రూ. 7,668 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. అయితే, ప్రాజెక్టు పూర్తయ్యేనాటికి ట్రాఫిక్ గణనీయంగా పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో ఒకేసారి 4 లేన్ల నిర్మాణం చేపట్టడమే సరైనదని భావిస్తున్నారు. ఒకే పిల్లర్‌పై ఇరువైపులా వాహనాలు వెళ్లేలా పేవ్‌డ్‌ షోల్డర్లతో దీన్ని నిర్మించనున్నారు. ఈ మార్పులకు అనుగుణంగా ఎన్‌హెచ్‌ఏఐ త్వరలోనే కొత్త డీపీఆర్ సిద్ధం చేయనుంది. ఈ నిర్మాణ ప్రక్రియ వల్ల అటవీ ప్రాంతంలో సుమారు 2 లక్షల చెట్లపై ప్రభావం పడుతుందని ప్రాథమిక అంచనా.

గతంలో ఈ ప్రాజెక్టు ఆర్థికంగా అంత లాభదాయకం కాదని కేంద్రం భావించినా, శ్రీశైలం పుణ్యక్షేత్రానికి ప్రయాణ సమయం తగ్గించడంతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య వాణిజ్యానికి ఇది అత్యంత కీలకమని తెలంగాణ ప్రభుత్వం నొక్కిచెప్పింది. ప్రాజెక్టు వ్యయంలో 50 శాతం భరించేందుకు కూడా అంగీకరించింది. తాజాగా 4 లేన్లకు విస్తరిస్తున్నందున ప్రాజెక్టు వ్యయం భారీగా పెరిగే అవకాశం ఉంది. పెరిగిన వ్యయం, నిధుల సమీకరణ వంటి అంశాలపై త్వరలోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉన్నతాధికారుల మధ్య సమావేశం జరగనుంది.
Advertisement
Srisailam Elevated Corridor
NHAI
Srisailam Forest
Hyderabad Srisailam Highway
NH 765
Telangana Government

More Telugu News