Dubai Indians: దుబాయ్‌లో సాధారణంగానే ఉంది... కానీ ముందు జాగ్రత్తగా వచ్చేశాం: భారత్ తిరిగొచ్చిన ఓ వ్యక్తి

Dubai Indians Return Home Amid Middle East Tensions
  • మధ్యప్రాచ్య ఉద్రిక్తతల నేపథ్యంలో స్వదేశానికి వస్తున్న ప్రయాణికులు
  • దుబాయ్‌లో జనజీవనం సాధారణంగానే ఉందంటున్న భారతీయులు
  • పేలుళ్ల శబ్దాలకు పిల్లలు భయపడటంతోనే తిరుగు ప్రయాణం
  • భారత రాయబార కార్యాలయం అందించిన సాయంపై ప్రశంసలు
మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా దుబాయ్‌లో ఉన్న భారతీయులు ముందస్తు జాగ్రత్తగా స్వదేశానికి తిరిగి వస్తున్నారు. తాజాగా ఢిల్లీ ఎయిర్‌పోర్టులో దిగిన పలువురు ప్రయాణికులు అక్కడి పరిస్థితులను మీడియాతో పంచుకున్నారు. దుబాయ్ నగరంలో జనజీవనం చాలా వరకు సాధారణంగానే ఉందని, అయితే ఇరాన్, ఇజ్రాయెల్ పరిణామాల నేపథ్యంలో ముందుజాగ్రత్తగా ఇండియా వచ్చేశామని తెలిపారు.

"స్థానికులుగా మాకేమీ తేడా అనిపించడం లేదు. సిటీలో పరిస్థితులు మామూలుగానే ఉన్నాయి. కానీ అక్కడక్కడా జరుగుతున్న దాడులు, వార్తల కారణంగా ఇక్కడ ఉండటం కంటే ఇంటికి వెళ్లడం మంచిదనిపించింది" అని ఒక ప్రయాణికుడు పేర్కొన్నారు. మరో ప్రయాణికుడు మాట్లాడుతూ.. ఒకటి రెండు రోజులు పేలుళ్ల శబ్దాలు వినిపించాయని, దాంతో పిల్లలు బాగా భయపడ్డారని, అందుకే రిస్క్ తీసుకోకుండా వెనక్కి వచ్చామని వివరించారు. రోడ్లపై వాహనాలు తిరుగుతున్నాయని, ఆఫీసులు, షాపులు యథావిధిగా నడుస్తున్నాయని స్పష్టం చేశారు.

ఇక విమాన ప్రయాణాల గురించి ప్రయాణికులు మాట్లాడుతూ.. ఫిబ్రవరి 28న దుబాయ్ ఎయిర్‌పోర్ట్ పరిస్థితి కాస్త గందరగోళంగా ఉన్నా, ఇప్పుడు పరిస్థితులు చాలా మెరుగుపడ్డాయని తెలిపారు. నిలిచిపోయిన విమానాలు కూడా ఇప్పుడిప్పుడే తిరిగి ప్రారంభమవుతున్నాయన్నారు. ఈ సమయంలో దుబాయ్‌లోని భారత రాయబార కార్యాలయం ఎంతో సాయం చేసిందని, తాము ఫోన్ చేసిన వెంటనే స్పందించి తగిన గైడెన్స్ ఇచ్చారని ప్రయాణికులు కృతజ్ఞతలు తెలిపారు. వారం క్రితం శుభకార్యాలకు వెళ్లిన వారు కూడా క్షేమంగా తిరిగి వస్తున్నారు. ఉద్రిక్తతల నేపథ్యంలో అధికారులు నిరంతరం పరిస్థితులను సమీక్షిస్తున్నారు.
Dubai Indians
Dubai
Indians in Dubai
Israel Iran conflict
Dubai airport
India
Middle East tensions
Repatriation
Indian Embassy Dubai

More Telugu News