Alistair Cook: భారత్, పాక్ క్రికెటర్లపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు

Alistair Cook Comments on India Pakistan Cricketers
  • మైదానంలో 'నో-హ్యాండ్‌షేక్' విధానం కేవలం నాటకమేనన్న అలిస్టర్ కుక్
  • తెరవెనుక, మూసి ఉన్న గదుల్లో ఆటగాళ్లు సాధారణంగానే మాట్లాడుకుంటారని వెల్లడి
  • భారత జట్టును చూసి పాక్ ఆటగాళ్లు భయపడుతున్నారని మైఖేల్ వాన్ అభిప్రాయం
  • గత ఏడాది ఆసియా కప్ నుంచి కొనసాగుతున్న ఈ 'నో-హ్యాండ్‌షేక్' సంప్రదాయం
క్రికెట్ ప్రపంచంలో చిరకాల ప్రత్యర్థులైన భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య మైదానంలో కనిపించే తీవ్రత, కరచాలనం చేసుకోకపోవడం అంతా కేవలం ప్రజలను, కెమెరాలను మభ్యపెట్టేందుకేనని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ అలిస్టర్ కుక్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. మైదానంలో ఒకరినొకరు పలకరించుకోని ఈ ఆటగాళ్లు, తెరవెనుక, మూసి ఉన్న గదుల్లో మాత్రం స్నేహంగానే మాట్లాడుకుంటారని, అంతా బాగున్నట్లే ప్రవర్తిస్తారని కుక్ ఆరోపించాడు.

ఇటీవల టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా భారత్ చేతిలో పాకిస్థాన్ ఓటమి పాలైన నేపథ్యంలో, 'స్టిక్ టు క్రికెట్' అనే పాడ్‌కాస్ట్‌లో ఈ అంశంపై చర్చ జరిగింది. ఈ కార్యక్రమంలో కుక్‌తో పాటు ఇంగ్లండ్ మాజీ క్రికెటర్లు మైఖేల్ వాన్, డేవిడ్ లాయిడ్, ఫిల్ టఫ్నెల్ పాల్గొన్నారు. చర్చ సందర్భంగా టఫ్నెల్ మాట్లాడుతూ, "భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఇప్పుడు ఏకపక్షంగా మారింది" అని అభిప్రాయపడ్డాడు. దీనికి మైఖేల్ వాన్ స్పందిస్తూ, పాకిస్థాన్ ఆటగాళ్లు భారత జట్టును చూసి భయపడుతున్నట్లు కనిపిస్తోందన్నాడు. రెండు జట్ల ఆటగాళ్లు కరచాలనం చేసుకోకపోవడం సిగ్గుచేటుగా, బాధాకరంగా ఉందని పేర్కొన్నాడు.

అయితే, అలిస్టర్ కుక్ మాత్రం ఈ అంశాన్ని భిన్నమైన కోణంలో విశ్లేషించాడు. "వాళ్లు మూసి ఉన్న గదుల్లో మాట్లాడుకోవడం లేదా? అందరూ సాధారణంగానే చాట్ చేసుకుంటున్నారని నేను ఎక్కడో చదివాను. మైదానంలో కరచాలనం చేసుకోకపోవడం అనేది కేవలం ప్రదర్శన కోసమే. తెరవెనుక మాత్రం వాళ్లంతా మాట్లాడుకుంటారు, అంతా బాగుంటారు" అని కుక్ పేర్కొన్నాడు. 

పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం, గత ఏడాది ఆసియా కప్‌లో టాస్ సమయంలో భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, పాక్ కెప్టెన్‌తో కరచాలనం చేయడానికి నిరాకరించడంతో ఈ 'నో-హ్యాండ్‌షేక్' విధానం తెరపైకి వచ్చింది. ఆ టోర్నమెంట్‌లోని మూడు మ్యాచ్‌లలోనూ ఇరు జట్లు ఒకరినొకరు అభినందించుకోలేదు. ఆ తర్వాత మహిళల ప్రపంచకప్, ఎమర్జింగ్ ఆసియా కప్, యూత్ ప్రపంచకప్‌లలోనూ ఇదే సంప్రదాయం కొనసాగింది. తాజాగా జరిగిన టీ20 ప్రపంచకప్‌లో కూడా ఇరు జట్లు ఈ విధానానికే కట్టుబడ్డాయి. ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్ 2026లో సెమీఫైనల్ లేదా ఫైనల్‌లో తలపడినా ఇదే విధానాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
Alistair Cook
India Pakistan cricket
India vs Pakistan
cricket rivalry
T20 World Cup
Michael Vaughan
cricket handshake
England cricket
cricket controversy

More Telugu News