Anand Mahindra: వెయ్యేళ్ల నాటి అద్భుతం... బృహదీశ్వర ఆలయంపై ఆనంద్ మహీంద్రా ప్రశంసలు

Anand Mahindra Praises Brihadeeswarar Temple A Millennial Marvel
షార్ట్స్‌లో చూడండి
ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా, తమిళనాడులోని తంజావూరు బృహదీశ్వర ఆలయ నిర్మాణ నైపుణ్యంపై ప్రశంసలు కురిపించారు. వెయ్యేళ్ల క్రితమే నిర్మించిన ఈ ఆలయం, భారత ప్రాచీన ఇంజినీరింగ్ అద్భుతానికి నిలువెత్తు నిదర్శనమని కొనియాడారు. ఆలయానికి సంబంధించిన ఒక వీడియోను ఆదివారం ఆయన సోషల్ మీడియాలో పంచుకున్నారు.

"భారతదేశంలోని గొప్ప ఆలయాలను సందర్శించడం ఒక విలువైన వ్యసనం" అని ఆనంద్ మహీంద్రా తన పోస్టులో పేర్కొన్నారు. ఈ ఆలయాలు కేవలం ఆధ్యాత్మిక కేంద్రాలుగానే కాకుండా, అద్భుతమైన ఇంజినీరింగ్ నైపుణ్యానికి ప్రతీకలని ఆయన అభిప్రాయపడ్డారు. ఆయన షేర్ చేసిన వీడియోలో, సాయంత్రం వేళ విద్యుత్ దీపాల వెలుగులో ఆలయ గోపురం, ప్రాంగణం అత్యంత శోభాయమానంగా కనిపిస్తున్నాయి.

తంజావూరులోని కావేరి నది ఒడ్డున ఉన్న ఈ బృహదీశ్వర ఆలయాన్ని చోళ చక్రవర్తి రాజరాజ చోళుడు క్రీ.శ. 1003 నుంచి 1010 మధ్య నిర్మించారు. పూర్తిగా గ్రానైట్ రాయితో నిర్మించిన ఈ ఆలయంలో సున్నం గానీ, ఇతర మిశ్రమాలు గానీ వాడలేదు. కేవలం ఇంటర్‌లాకింగ్ పద్ధతిలో రాళ్లను ఒకదానితో ఒకటి కలిపి పేర్చారు. భూకంపాలను సైతం తట్టుకొని వెయ్యేళ్లకు పైగా చెక్కుచెదరకుండా నిలవడం దీని నిర్మాణ పటిష్టతకు నిదర్శనం.

సుమారు 66 మీటర్ల ఎత్తున్న ఆలయ విమాన గోపురంపై 80 టన్నుల బరువున్న ఏకశిలను అమర్చడం ఇప్పటికీ ఇంజినీర్లకు అంతుచిక్కని రహస్యమే. ఆనంద్ మహీంద్రా పోస్టుతో ఈ ఆలయంపై సోషల్ మీడియాలో మరోసారి చర్చ మొదలైంది. ఎలాంటి క్రేన్లు, ఆధునిక యంత్రాలు లేని కాలంలో అంత బరువైన శిలను అంత ఎత్తుకు ఎలా చేర్చారని నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 

యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన ఈ ఆలయం, నేటికీ పూజలు అందుకుంటూ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది.
Go Back to Shorts
Anand Mahindra
Brihadeeswarar Temple
Thanjavur
Tamil Nadu
Chola Dynasty
Raja Raja Chola
Indian Architecture
Ancient Engineering
UNESCO World Heritage Site
Temple Construction

More Telugu News