స్థానిక ఎన్నికల జీవో 46పై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరణ.. తెలంగాణలో స్థానిక ఎన్నికలకు లైన్ క్లియర్
- ఎన్నికల నిర్వహణకు తొలగిన అడ్డంకులు
- ప్రస్తుత దశలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసిన ధర్మాసనం
- ఆరు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశం
ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు కలిపి రిజర్వేషన్లు 50 శాతం మించరాదని నిర్దేశిస్తూ ప్రభుత్వం నవంబర్ 22న జీవో 46ను జారీ చేసింది. అయితే, ఈ జీవో చట్టవిరుద్ధంగా ఉందని, దీని ఆధారంగా ఎన్నికలు నిర్వహించకుండా నిలిపివేయాలని కోరుతూ పలు వెనుకబడిన కుల సంఘాలు హైకోర్టును ఆశ్రయించాయి.
విచారణ సందర్భంగా, ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యాక కోర్టులు జోక్యం చేసుకోలేవని ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది చేసిన వాదనతో ధర్మాసనం ఏకీభవించింది. సబ్-కేటగిరీ రిజర్వేషన్లు లేవనే కారణంతో ఎన్నికలను ఆపాలని కోరుతున్నారా? అని పిటిషనర్లను ప్రశ్నించింది. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం, ఈ వ్యవహారంపై ఆరు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేస్తూ విచారణను వాయిదా వేసింది.