శబరిమలకు రికార్డు స్థాయిలో భక్తుల రాక
- భక్తులతో కిటకిటలాడుతున్న శబరిమల అయ్యప్ప ఆలయం
- తొలి వారంలోనే 5.75 లక్షల మందికి పైగా దర్శనం చేసుకున్నారన్న అధికారులు
- శనివారం ఒక్కరోజే 72 వేలకు పైగా భక్తులు వచ్చినట్లు వెల్లడి
- భక్తుల రద్దీ నిర్వహణపై అధికారుల సమీక్ష
భక్తుల ప్రవాహం నిరంతరాయంగా కొనసాగుతోందని అధికారులు తెలిపారు. అప్పుడప్పుడు వర్షం పడుతున్నా యాత్రకు ఎలాంటి ఆటంకం కలగడం లేదని, భక్తులు పవిత్రమైన 18 మెట్లు ఎక్కేందుకు వీలుగా క్యూ షెల్టర్ల వద్ద ఎక్కువసేపు వేచి ఉండాల్సిన అవసరం లేకుండా ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. మరోవైపు, భక్తుల రద్దీ, ఏర్పాట్లపై మంత్రి వీఎన్ వాసవన్ ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు (టీడీబీ) అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
యాత్ర ప్రారంభంలో భక్తులు భారీగా పోటెత్తడంతో, రద్దీ నిర్వహణను మెరుగుపరచాలని కేరళ హైకోర్టు ఇటీవల అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తొలుత రోజుకు 5 వేలకు పరిమితం చేసిన స్పాట్ బుకింగ్ల సంఖ్యను, భక్తుల రద్దీకి అనుగుణంగా సర్దుబాటు చేసుకునేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది.