APSDMA: జంట ఉపరితల ఆవర్తనాలు... ఏపీకి వర్ష సూచన

APSDMA Warns of Heavy Rains in Andhra Pradesh
షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల ప్రజలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) కీలక హెచ్చరిక జారీ చేసింది. రాష్ట్రంపై ఏర్పడిన రెండు ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో మంగళవారం ఏడు జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని సూచించింది.

ఈ మేరకు ఏపీఎస్‌డీఎంఏ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం, మంగళవారం (అక్టోబరు 14) ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, నెల్లూరు, కర్నూలు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని తెలిపారు. అదే సమయంలో అల్లూరి సీతారామరాజు, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించారు.

ప్రస్తుతం కోస్తాంధ్ర, దాని పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని ప్రఖర్ జైన్ పేర్కొన్నారు. దీనికి తోడుగా, నైరుతి బంగాళాఖాతం నుంచి దక్షిణ తమిళనాడు తీరం వరకు మరో ఆవర్తనం విస్తరించి ఉందని, ఈ రెండింటి ప్రభావంతోనే రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయని స్పష్టం చేశారు.

వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. ముఖ్యంగా పిడుగులు పడే అవకాశం ఉన్నందున రైతులు, కూలీలు, పశువుల కాపరులు పొలాల్లోని చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని హెచ్చరించింది. బలమైన గాలులు వీచే అవకాశం ఉన్నందున పాత భవనాలు, భారీ హోర్డింగులకు దూరంగా ఉండాలని కోరింది.
Go Back to Shorts
APSDMA
Andhra Pradesh rains
heavy rainfall warning
weather forecast
cyclonic circulations
coastal Andhra
Rayalaseema
lightning strikes
district wise rainfall
October weather

More Telugu News