Chandrababu Naidu: ములకలచెరువు కల్తీ మద్యం ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్... కఠిన చర్యలకు ఆదేశం

Chandrababu Naidu Orders Strict Action on Mulakala Cheruvu Fake Liquor Incident
షార్ట్స్‌లో చూడండి
రాష్ట్రంలో నకిలీ మద్యం విక్రయాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని, ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే వారిపై ఉక్కుపాదం మోపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను దిశానిర్దేశం చేశారు. అన్నమయ్య జిల్లా ములకలచెరువులో వెలుగుచూసిన భారీ నకిలీ మద్యం రాకెట్ వ్యవహారంలో నిందితులు ఎంతటివారైనా వదిలిపెట్టవద్దని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో, నిష్పక్షపాతంగా దర్యాప్తు జరపాలని ఆయన సూచించారు.

ములకలచెరువు ఘటన నేపథ్యంలో ఆదివారం తన క్యాంపు కార్యాలయంలో ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేశ్ కుమార్ మీనా, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ రాహుల్ దేవ్ శర్మ, ఎక్సైజ్ కమిషనర్ శ్రీధర్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా, ములకలచెరువులో నకిలీ మద్యం దందా గుట్టును ఎలా రట్టు చేశారో అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.

తొలుత కొందరు వ్యక్తులు నకిలీ మద్యం బాటిళ్లతో పట్టుబడగా, వారిని విచారించి సేకరించిన సమాచారంతో ములకలచెరువు సమీపంలోని కదిరినత్తునికోట గ్రామంలో సోదాలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ఈ తనిఖీల్లో భారీ నకిలీ మద్యం తయారీ కేంద్రం బయటపడిందని వివరించారు. ఈ దందాకు సంబంధించి మొత్తం 14 మందిని గుర్తించామని, వారిలో ఇప్పటికే 10 మందిని అరెస్టు చేశామని వెల్లడించారు. ఘటనా స్థలం నుంచి ఫేక్ లేబుళ్లు, స్టిక్కర్లు, వివిధ బ్రాండ్ల నకిలీ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు ముఖ్యమంత్రికి తెలిపారు.

ఈ రాకెట్ వెనుక ప్రధాన సూత్రధారి (ఏ1) అద్దేపల్లి జనార్దన్ రావు అని, అతనికి విజయవాడలో ఒక బార్ లైసెన్సు కూడా ఉందని అధికారులు గుర్తించారు. కేవలం నకిలీ మద్యం దందా కోసమే అతను ములకలచెరువుకు వచ్చాడని, ప్రస్తుతం విదేశాల్లో తలదాచుకున్నట్లు సమాచారం ఉందని తెలిపారు. తమిళనాడు, ఒడిశా రాష్ట్రాలకు చెందిన వ్యక్తులను పనిలో పెట్టుకుని ఈ కేంద్రాన్ని నడిపిస్తున్నట్లు విచారణలో తేలిందన్నారు. ఇక్కడ తయారు చేసిన నకిలీ మద్యాన్ని పెద్దతిప్పసముద్రంలోని ఆంధ్రా వైన్స్, ములకలచెరువులోని రాక్ స్టార్ వైన్స్ అనే రెండు లైసెన్సు ఉన్న దుకాణాల ద్వారా విక్రయించినట్లు నిందితులు అంగీకరించారని అధికారులు వివరించారు.

రాక్ స్టార్ వైన్స్ లైసెన్సుదారుడైన టి. రాజేష్‌కు చెందిన వాహనంలోనే నకిలీ మద్యాన్ని తరలిస్తుండగా పట్టుకున్నామని, సదరు రెండు వైన్ షాపులను సీజ్ చేశామని తెలిపారు. ఈ కేసులో స్థానిక నాయకుడు జయచంద్రారెడ్డి పాత్రపై కూడా సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు జనార్దన్ రావుతో పాటు మరో ముగ్గురి కోసం గాలిస్తున్నామని, ఈ దందా వెనుక ఉన్న ఆర్థిక లావాదేవీలు, సరఫరా నెట్‌వర్క్‌పై లోతుగా విచారణ జరుపుతున్నామని ముఖ్యమంత్రికి వివరించారు. అధికారుల నివేదిక విన్న అనంతరం చంద్రబాబు, ఈ వ్యవహారంలో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరినీ చట్టం ముందు నిలబెట్టాలని కఠినంగా ఆదేశించారు.
Go Back to Shorts
Chandrababu Naidu
Andhra Pradesh
Fake Liquor
Counterfeit Alcohol
Addeapalli Janardan Rao
Mulkala Cheruvu
Andhra Wines
Excise Department
Crime News
T Rajesh

More Telugu News