Lindsey Graham: రష్యాకు మద్దతు.. భారత్, చైనాకు అమెరికా సెనేటర్ హెచ్చరిక

Lindsey Graham warns India China on Russia support
షార్ట్స్‌లో చూడండి
రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్, చైనా, బ్రెజిల్ వంటి దేశాలపై అమెరికా రిపబ్లికన్ పార్టీకి చెందిన సీనియర్ సెనేటర్ లిండ్సే గ్రాహం మరోసారి తీవ్రంగా విమర్శలు గుప్పించారు. ఈ దేశాల చర్యల వల్లే ఉక్రెయిన్‌లో రష్యా యుద్ధ యంత్రాంగం కొనసాగుతోందని ఆయన ఆరోపించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు మద్దతు ఇస్తున్నందుకు భారత్ ఇప్పటికే మూల్యం చెల్లించుకుంటోందని, ఇతర దేశాలకు కూడా త్వరలోనే ఇదే గతి పడుతుందని ఆయన గట్టిగా హెచ్చరించారు.

గురువారం ఉక్రెయిన్‌లోని కీవ్‌ నగరంపై రష్యా జరిపిన భీకర దాడిలో 23 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన జరిగిన వెంటనే లిండ్సే గ్రాహం సామాజిక మాధ్యమం 'ఎక్స్' వేదికగా స్పందించారు. "రష్యా నుంచి చౌకగా చమురు కొనుగోలు చేస్తూ పుతిన్ యుద్ధానికి ఊతమిస్తున్న భారత్, చైనా, బ్రెజిల్ వంటి దేశాలకు ఇప్పుడెలా అనిపిస్తోంది? మీ కొనుగోళ్ల వల్లే పిల్లలతో సహా అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారు. పుతిన్‌కు మద్దతిచ్చినందుకు భారత్ ఇప్పటికే మూల్యం చెల్లిస్తోంది. మిగతా దేశాలకు కూడా త్వరలోనే ఇదే గతి పడుతుంది" అని ఆయన తన పోస్ట్‌లో పేర్కొన్నారు.

గతంలో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు భారత దిగుమతులపై 50 శాతం టారిఫ్‌లు విధించిన విషయాన్ని ఆయన పరోక్షంగా ప్రస్తావించారు. పుతిన్‌కు మద్దతివ్వడం వల్లే భారత్ ఇలాంటి పరిణామాలను ఎదుర్కొంటోందని వ్యాఖ్యానించారు. రష్యాతో వాణిజ్యం కొనసాగిస్తున్న ఇతర దేశాలు కూడా ఇలాంటి పర్యవసానాలకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు.

లిండ్సే గ్రాహం చాలాకాలంగా రష్యా చమురు ఆదాయంపై విమర్శలు చేస్తున్నారు. "చమురు, గ్యాస్ ఆదాయం లేకపోతే రష్యా కుప్పకూలిపోతుంది. భారత్, చైనా, బ్రెజిల్ వంటి దాని వినియోగదారులను దెబ్బతీయడమే మా ప్రధాన లక్ష్యం" అని ఆయన గతంలో ఎన్‌బీసీకి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. ఇతర దేశాల నుంచి వస్తున్న ఆదాయంతోనే రష్యా యుద్ధాన్ని కొనసాగిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు.
Go Back to Shorts
Lindsey Graham
Russia Ukraine war
India Russia oil
China Russia oil
US Senator
oil imports

More Telugu News