కూకట్పల్లి బాలిక హత్య కేసులో మిస్టరీ వీడింది.. నిందితుడు పదో తరగతి విద్యార్థి!
- సహస్ర ఇంటికి చోరీకి వెళ్లిన నిందితుడు
- సహస్ర అక్కడే ఉండటంతో పలుమార్లు కత్తితో పొడిచిన నిందితుడు
- బాలిక శరీరంపై 20 వరకు కత్తిగాట్లు గుర్తించిన పోలీసులు
బాలిక శరీరంపై 20 వరకు కత్తి గాయాలు ఉండగా, మెడపై 10 కత్తి గాట్లను పోలీసులు గుర్తించారు. పోస్టుమార్టం ప్రాథమిక నివేదిక ప్రకారం ఈ హత్య సోమవారం ఉదయం తొమ్మిదిన్నర నుంచి పదిన్నర గంటల మధ్య జరిగింది. ఆ సమయంలో బాలిక కేకలు వినిపించినట్లు పక్క భవనంలో నివసించేవారు పోలీసులకు సమాచారం అందించారు.
సహస్ర తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో నిందితుడు పక్క భవనం నుంచి వీరి ఇంట్లోకి ప్రవేశించాడు. డబ్బు దొంగిలించే ప్రయత్నం చేస్తుండగా సహస్ర గమనించింది. దీంతో దొంగతనం విషయం తన తల్లిదండ్రులకు చెబుతానని హెచ్చరించింది. భయపడిన బాలుడు సహస్రను పలుమార్లు కత్తితో పొడిచి హత్య చేశాడు. అనంతరం పక్కనే ఉన్న భవనంలోకి వెళ్లి 15 నిమిషాలు దాక్కున్నాడు. ఈ విషయాన్ని గమనించిన ఒక సాఫ్ట్వేర్ ఇంజినీర్ పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో ఎస్ఓటీ బృందం బాలుడు చదువుతున్న పాఠశాలకు వెళ్లి విచారణ చేపట్టింది.