MS Dhoni: ధోనీ రూ.100 కోట్ల పరువు నష్టం కేసులో కదలిక... విచారణకు హైకోర్టు ఆదేశం!

Dhoni Defamation Case Hearing to Expedite per Madras High Court
షార్ట్స్‌లో చూడండి
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ దాఖలు చేసిన రూ.100 కోట్ల పరువు నష్టం దావా కేసులో కీలక ముందడుగు పడింది. దాదాపు దశాబ్ద కాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ కేసు విచారణను వేగవంతం చేస్తూ మద్రాస్ హైకోర్టు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. విచారణలో భాగంగా ధోనీ వాంగ్మూలాన్ని నమోదు చేసేందుకు ప్రత్యేకంగా ఒక అడ్వకేట్ కమిషనర్‌ను నియమిస్తున్నట్లు కోర్టు ప్రకటించింది.

విచారణకు అడ్వకేట్ కమిషనర్

జస్టిస్ సీవీ కార్తీకేయన్ ఈ కేసుపై విచారణ జరిపారు. కేసు విచారణను వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు, ధోనీ వాంగ్మూలంతో పాటు ఇతర సాక్ష్యాధారాలను నమోదు చేయడానికి అడ్వకేట్ కమిషనర్‌ను నియమించారు. దీనివల్ల అనవసర జాప్యం నివారించవచ్చని న్యాయస్థానం అభిప్రాయపడింది. క్రాస్ ఎగ్జామినేషన్ కోసం ఈ ఏడాది అక్టోబర్ 20, డిసెంబర్ 10 తేదీల్లో తాను అందుబాటులో ఉంటానని ధోనీ తరఫున కోర్టుకు తెలిపారు. విచారణకు పూర్తిగా సహకరిస్తానని, కోర్టు, కమిషనర్ సూచనలను పాటిస్తానని ఆయన తన అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

కేసు పూర్వాపరాలు

2013లో ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ కుంభకోణం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ వివాదంపై కొన్ని మీడియా సంస్థలు, జర్నలిస్టులు టీవీ చర్చల్లో తనపై నిరాధారమైన వ్యాఖ్యలు చేశారని, తన ప్రతిష్టకు తీవ్ర నష్టం కలిగించారని ఆరోపిస్తూ ధోనీ 2014లో ఈ పరువు నష్టం దావా వేశారు. తన పరువుకు నష్టపరిహారంగా రూ.100 కోట్లు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.

ఈ కుంభకోణం కారణంగా చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లపై రెండేళ్ల నిషేధం పడింది. సీఎస్‌కే అధికారి గురునాథ్ మీయప్పన్, రాజస్థాన్ రాయల్స్ యజమాని రాజ్ కుంద్రా వంటి ప్రముఖులపై ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ వివాదంలో ధోనీపై వ్యక్తిగతంగా ఎలాంటి ఆరోపణలు లేనప్పటికీ, మీడియా కథనాలు హద్దులు దాటాయని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు. తాజాగా హైకోర్టు ఆదేశాలతో, పదేళ్లుగా నలుగుతున్న ఈ కేసు విచారణ త్వరగా పూర్తయ్యే అవకాశం కనిపిస్తోంది.
Go Back to Shorts
MS Dhoni
Dhoni defamation case
Madras High Court
IPL spot fixing
Gurunath Meiyappan
Chennai Super Kings
spot fixing scandal
cricket betting
defamation lawsuit
sports law

More Telugu News