Sher Khan: ఒకప్పుడు మృతదేహం వద్దన్నారు.. ఇప్పుడు ఆ సైనికాధికారికే పాక్ ఘన నివాళి!

Sher Khan Honored by Pakistan Army After Kargil Denial
షార్ట్స్‌లో చూడండి
కార్గిల్ యుద్ధంలో తమ సైనికాధికారి కెప్టెన్ కర్నల్ షేర్ ఖాన్ ధైర్యసాహసాలు చూపించాడంటూ పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ఘనంగా నివాళులర్పించారు. షేర్ ఖాన్ 26వ వర్ధంతి సందర్భంగా ఆయన దేశభక్తిని కొనియాడారు. అయితే, 1999లో ఇదే షేర్ ఖాన్ మృతదేహాన్ని స్వీకరించేందుకు పాకిస్థాన్ మొండిగా నిరాకరించడం గమనార్హం. నాడు అతడు తమ సైనికాధికారి కాదన్న దేశం, ఇప్పుడు ఆయనను అమరవీరుడిగా కీర్తించడం వారి ద్వంద్వ నీతిని స్పష్టం చేస్తోంది.

1999 కార్గిల్ యుద్ధ సమయంలో, ద్రాస్ సెక్టార్‌లోని టైగర్ హిల్‌పై కెప్టెన్ కర్నల్ షేర్ ఖాన్ మృతదేహాన్ని భారత సైన్యం కనుగొంది. ఆయన వద్ద లభించిన పత్రాల ఆధారంగా గుర్తింపును ధృవీకరించుకుని, మానవతా దృక్పథంతో ఆ భౌతికకాయాన్ని పాకిస్థాన్‌కు అప్పగించేందుకు సిద్ధమైంది. 1999 జూలై 12న ఈ విషయాన్ని పాకిస్థాన్‌కు తెలియజేసింది.

అయితే, కార్గిల్ యుద్ధంలో తమ ప్రమేయం లేదని, కేవలం ముజాహిదీన్లే పోరాడుతున్నారని ప్రపంచాన్ని నమ్మించే ప్రయత్నంలో ఉన్న పాకిస్థాన్, తమ అధికారి మృతదేహాన్ని స్వీకరించడానికి నిరాకరించింది. అలా చేస్తే, యుద్ధంలో తమ సైన్యం నేరుగా పాల్గొన్న విషయం బట్టబయలవుతుందని భయపడింది.

తర్వాత, అంతర్జాతీయ రెడ్‌క్రాస్ కమిటీ (ఐసీఆర్‌సీ) ద్వారా పాకిస్థాన్ ప్రభుత్వం తమ ఇద్దరు అధికారుల మృతదేహాలను అప్పగించాలని భారత్‌ను కోరింది. కానీ, తమ అబద్ధం ఎక్కడ బయటపడుతుందోనన్న భయంతో ఆ అధికారుల పేర్లను గానీ, గుర్తింపు వివరాలను గానీ వెల్లడించలేదు. ఈ చర్య ద్వారా పాకిస్థాన్ తమ సైనికుల కుటుంబాలకు తీవ్ర అన్యాయం చేసిందని, సైనిక సంప్రదాయాలను అగౌరవపరిచిందని ఆనాడే భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. ఒకప్పుడు అవమానకరంగా తిరస్కరించిన సైనికుడికి, ఇప్పుడు అమరవీరుడి హోదా ఇచ్చి నివాళులు అర్పించడం గమనార్హం.
Go Back to Shorts
Sher Khan
Kargil War
Pakistan Army
Asim Munir
India Pakistan conflict
Tiger Hill
Kargil conflict
Pakistani war hero
Indo-Pak war
military ethics

More Telugu News