గిల్ అద్భుత ఇన్నింగ్స్.. అండర్-16 రోజులు గుర్తొచ్చాయన్న తండ్రి

  • ఇంగ్లండ్‌పై రెండో టెస్టులో గిల్ డబుల్ సెంచరీ
  • కొడుకు ఆట చూసి మనసు నిండిపోయిందన్న తండ్రి
  • జూనియర్ క్రికెట్ రోజుల నాటి ఆటను గుర్తుచేశావన్న లక్ష్విందర్ సింగ్
  • నాన్న, స్నేహితుడి అభిప్రాయాలకే విలువిస్తానన్న గిల్
ఇంగ్లండ్‌పై భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ బాదిన డబుల్ సెంచరీపై అతని తండ్రి లక్ష్విందర్ సింగ్ సంతోషంతో ఉప్పొంగిపోయారు. తన కొడుకు ఆడిన అద్భుత ఇన్నింగ్స్ చూసి తన మనసు ప్రశాంతంగా ఉందని, ఎంతో గర్వంగా ఉందని ఆయన అన్నారు. గిల్ ఆటతీరు తనను అండర్-16, అండర్-19 రోజుల నాటి జ్ఞాపకాల్లోకి తీసుకెళ్లిందని ఆయన భావోద్వేగంతో తెలిపారు.

ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో గిల్ 269 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గిల్ తల్లిదండ్రులు పంపిన వాయిస్ మెసేజ్‌ను బీసీసీఐ సోషల్ మీడియాలో పంచుకుంది. అందులో గిల్ తండ్రి మాట్లాడుతూ, "అద్భుతంగా ఆడావు. నీ బ్యాటింగ్‌ను చాలా ఆస్వాదించా. చాలా గర్వంగా ఉంది" అని తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. గిల్ తల్లి కూడా "నీ బ్యాటింగ్ చాలా ఆనందాన్నిచ్చింది. భవిష్యత్తులోనూ ఇలాగే ఆడాలి" అని ఆకాంక్షించారు.

తల్లిదండ్రుల ప్రశంసలపై గిల్ స్పందించాడు. తాను క్రికెట్‌ ఆడేది తన తండ్రి కోసమేనని స్పష్టం చేశాడు. క్రికెట్‌కు సంబంధించి తన తండ్రి, తన స్నేహితుడు అభిషేక్ శర్మ అభిప్రాయాలకు తాను అత్యంత విలువ ఇస్తానని తెలిపాడు. ట్రిపుల్ సెంచరీ చేజార్చుకోవడంపై కూడా వారితో మాట్లాడినట్లు గిల్ పేర్కొన్నాడు.


More Telugu News