Pawan Kalyan: మధుర మీనాక్షి అమ్మవారికి, మురగన్ భూమి తమిళనాడుకి పవన్ కృతజ్ఞతలు

Pawan Kalyan Thanks Tamil Nadu Madurai After Murugan Event
షార్ట్స్‌లో చూడండి
జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తమిళనాడులోని మధురైలో నిర్వహించిన మురుగ భక్తర్గళ్ మానాడులో పాల్గొన్న విషయం విదితమే. మధురైలో పవన్ కల్యాణ్‌కు తొలుత అక్కడి బీజేపీ నేతల నుంచి ఘన స్వాగతం లభించింది. అనంతరం ఆయన వివిధ ప్రాంతాల్లోని మురుగన్ ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు.

ఆ తరువాత మానాడు వేదికపై ముఖ్య అతిథిగా పాల్గొన్న పవన్ కల్యాణ్ హిందూత్వం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను పదహారేళ్ల వయస్సులోనే శబరిమల అయ్యప్ప దర్శనానికి వెళ్ళానని, చిన్నతనంలో ఇంట్లో విభూతి పెట్టుకుని పాఠశాలకు వెళ్ళేవాడినని ఆయన గుర్తు చేసుకున్నారు. తాను అన్ని మతాలను గౌరవిస్తానని, హిందువుగా ఉండటం గర్వంగా ఉందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమం ముగిసిన అనంతరం పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వేదికగా దీనికి సంబంధించిన ఒక పోస్ట్ చేశారు. మీనాక్షి అమ్మవారి పవిత్ర భూమి మధురైకి, శక్తి స్వరూపుడు మురుగన్ నేల అయిన తమిళనాడుకు తన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నానని ఆయన అన్నారు. మీరు చూపిన ప్రేమ, భక్తి తనకు అపూర్వ అనుభూతిని కలిగించాయని, ఈ పవిత్ర భూమి, ఇక్కడి ప్రజలు ధార్మిక భారతదేశానికి జీవ రూపమని ఆయన కొనియాడారు.

మురుగన్ భక్తర్గళ్ మానాడు కార్యక్రమానికి అత్యంత భక్తి శ్రద్ధలతో హాజరైన ప్రతి భక్తుడికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమ్మేళనంలో ప్రతి ఒక్కరి ఉనికి ఒక దైవానుగ్రహంగా భావించాలని, ఈ భూమి ధర్మ పథాన్ని ముందుకు తీసుకెళ్తున్న ఆదర్శ ప్రదేశంగా నిలుస్తుందని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన నిర్వాహకులకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

ముఖ్యంగా తమిళనాడు అధ్యక్షుడు తిరు కడేశ్వర సుబ్రహ్మణ్యం అవర్గళ్, బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు తిరునైనార్ నాగేంద్రన్ అవర్గళ్, మాజీ అధ్యక్షుడు తిరు అన్నామలై అవర్గళ్, కేంద్ర మంత్రి తిరు ఎల్ మురుగన్, మాజీ తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్, సీనియర్ నాయకులు రాధాకృష్ణన్, ఈ కార్యక్రమానికి హాజరైన మత గురువులు, ఇతర గౌరవ అతిథులు, భక్తులకు ఆయన హృదయపూర్వక నమస్సుమాంజలి తెలియజేశారు. ప్రస్తుతం పవన్ మధురై పర్యటనకు సంబంధించిన ఫోటోలు, ఆయన చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 
Go Back to Shorts
Pawan Kalyan
Janasena
Tamil Nadu
Madurai
Murugan
Meenakshi Amman
BJP
Hinduism
Political News
Andhra Pradesh

More Telugu News