Rahul Gandhi: ఆపరేషన్‌పై పాకిస్థాన్‌కు ముందే సమాచారం ఇచ్చారన్న రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై కేంద్రం స్పందన

Rahul Gandhis Allegation on Operation Sindhu Sparks Controversy
షార్ట్స్‌లో చూడండి
ఆపరేషన్ సిందూర్ పై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపాయి. ఆపరేషన్‌పై ముందే పాకిస్థాన్‌కు సమాచారం ఇవ్వడం 'నేరం' అంటూ రాహుల్ చేసిన ఆరోపణలను కేంద్ర విదేశాంగ శాఖ, బీజేపీ తీవ్రంగా ఖండించాయి. రాహుల్ గాంధీ తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని బీజేపీ ఆరోపించింది.

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ 'ఎక్స్' వేదికగా విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మాట్లాడిన ఒక వీడియోను పంచుకున్నారు. మే 6, 7 తేదీల మధ్య రాత్రి జరిగిన ఆపరేషన్ సిందూర్ సమయంలో, ఉగ్రవాద స్థావరాలపై మాత్రమే దాడి చేస్తున్నామని, సైనిక స్థావరాలపై కాదని పాకిస్థాన్‌కు సందేశం పంపామని జైశంకర్ ఆ వీడియోలో చెప్పినట్లు ఉంది. "ఆపరేషన్ మొదలైనప్పుడు, మేము ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై దాడులు చేస్తున్నామని, సైన్యంపై కాదని పాకిస్థాన్‌కు సందేశం పంపాము. ఈ ప్రక్రియలో జోక్యం చేసుకోకుండా సైన్యం దూరంగా ఉండే అవకాశం వారికి ఉంది. కానీ వారు ఆ మంచి విషయాన్ని పరిగణనలోకి తీసుకోలేదు" అని జైశంకర్ ఆ వీడియోలో పేర్కొన్నారు.

ఈ వ్యాఖ్యలను ఉటంకిస్తూ, దాడి ప్రారంభంలోనే పాకిస్థాన్‌కు సమాచారం ఇవ్వడం నేరం అని రాహుల్ ఆరోపించారు. "విదేశాంగ మంత్రి స్వయంగా భారత ప్రభుత్వం ఈ పని చేసిందని బహిరంగంగా ఒప్పుకున్నారు" అని గాంధీ మండిపడ్డారు. పాకిస్థాన్‌తో ఈ సమాచారాన్ని పంచుకోవడానికి ఎవరు అధికారం ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. అంతేకాకుండా, "దీని ఫలితంగా మన వైమానిక దళం ఎన్ని విమానాలను కోల్పోయింది?" అంటూ రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన వ్యాఖ్యలపై కేంద్రం, బీజేపీ తీవ్రంగా స్పందించింది.

కేంద్రం స్పష్టీకరణ

ఈ వివాదంపై కేంద్ర విదేశాంగ శాఖ శనివారం సాయంత్రం ఒక ప్రకటన విడుదల చేసింది. వాస్తవాలను తప్పుగా చిత్రీకరిస్తున్నారని పేర్కొంది. "ఆపరేషన్ సిందూర్ ప్రారంభమైన తర్వాత తొలి దశలోనే పాకిస్థాన్‌ను హెచ్చరించామని విదేశాంగ మంత్రి స్పష్టంగా చెప్పారు. దీనిని ఆపరేషన్ ప్రారంభానికి ముందే అన్నట్లు తప్పుగా ప్రచారం చేస్తున్నారు. ఈ వాస్తవ వక్రీకరణను తీవ్రంగా ఖండిస్తున్నాం" అని విదేశాంగ శాఖ తమ ప్రకటనలో స్పష్టం చేసింది.

బీజేపీ ఖండన

రాహుల్ గాంధీ ఆరోపణలు చేసిన గంటలోపే బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారి స్పందించారు. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) చేసిన ఫ్యాక్ట్ చెక్ వివరాలను పంచుకుంటూ, రాహుల్ గాంధీ తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఆపరేషన్ సింధూర్ ప్రారంభానికి ముందే భారత్ పాకిస్థాన్‌కు సమాచారం ఇచ్చిందని జైశంకర్ చెప్పినట్లుగా ఒక జర్నలిస్టు చేసిన ఆరోపణను పీఐబీ గురువారమే ఖండించిందని భండారి గుర్తుచేశారు.

ఆపరేషన్‌కు ముందే పాక్‌కు సమాచారం ఇచ్చారనేది అవాస్తవమని, సామాజిక మాధ్యమాల్లో తప్పుగా ప్రచారం సాగిందని పీఐబీ ఆ పోస్టులో పేర్కొందని గుర్తు చేశారు. జైశంకర్ చేసిన వ్యాఖ్యలను తప్పుగా చూపించారని, ఇలాంటి మోసపూరిత ప్రకటనల పట్ల అప్రమత్తంగా ఉండాలని కూడా పీఐబీ సూచించిందని తెలిపారు.
Go Back to Shorts
Rahul Gandhi
Operation Sindhu
Pakistan
S Jaishankar
BJP
Congress

More Telugu News