IMD: నైరుతి రుతుపవనాల రాకపై చల్లని కబురు చెప్పిన ఐఎండీ

- సాధారణం కన్నా 5 రోజులు ముందుగా రుతుపవనాల ఆగమనం
- ఖరీఫ్ పంటల సాగుకు రైతులకు అనుకూలం
- భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడి
- ఈ ఏడాది దేశంలో సాధారణం కన్నా అధిక వర్షపాతం అంచనా
దేశ ప్రజలు, ముఖ్యంగా రైతులు ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది కేరళ తీరాన్ని కాస్త ముందుగానే పలకరించనున్నాయి. సాధారణంగా జూన్ 1న ప్రవేశించే రుతుపవనాలు, ఈసారి మే 27వ తేదీనే కేరళను తాకే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) శనివారం ఒక ప్రకటనలో తెలియజేసింది. ఇది సాధారణ తేదీ కన్నా ఐదు రోజులు ముందు కావడం గమనార్హం.
రుతుపవనాల ముందస్తు ఆగమనం ఖరీఫ్ పంటల సాగు పనులను త్వరగా ప్రారంభించేందుకు రైతులకు ఎంతగానో ఉపకరిస్తుంది. ఈ అంచనాతో రైతులు వ్యవసాయ పనులకు సన్నద్ధం కావడానికి వీలు కలుగుతుంది. భారత ప్రధాన భూభాగంలోకి రుతుపవనాల ప్రవేశానికి కేరళ ఆరంభమే ఒక ముఖ్యమైన సూచికగా పరిగణిస్తారు. వేడి, పొడి వాతావరణం నుంచి వర్షాకాలంలోకి మారడాన్ని ఇది సూచిస్తుంది. పైగా భారత్ కు అత్యధిక వర్షతాపాన్ని అందించేంది నైరుతి రుతుపవనాలే.
"ఈ సంవత్సరం, నైరుతి రుతుపవనాలు మే 27న కేరళలో ప్రవేశించే అవకాశం ఉంది. మా నమూనా అంచనాలో అటూఇటూగా 4 రోజుల వ్యత్యాసం ఉండవచ్చు" అని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కేరళలో రుతుపవనాల ప్రవేశ తేదీని అంచనా వేయడానికి ఐఎండీ ఆరు రకాల సూచికలను ఉపయోగిస్తుంది. సాధారణంగా నైరుతి రుతుపవనాలు జూన్ 1న కేరళలో ప్రవేశించి, సుమారు ఏడు రోజుల ప్రామాణిక వ్యత్యాసంతో జూలై 8 నాటికి దేశవ్యాప్తంగా విస్తరిస్తాయి.
2005 నుంచి కేరళలో రుతుపవనాల ప్రవేశ తేదీపై ఐఎండీ కార్యాచరణ అంచనాలను జారీ చేస్తోంది. ఇందుకోసం దేశీయంగా అభివృద్ధి చేసిన అత్యాధునిక స్టాటిస్టికల్ నమూనాను ఉపయోగిస్తున్నట్లు అధికారులు వివరించారు. ఈ నమూనాలో అటూఇటూగా 4 రోజుల దోషానికి అవకాశం ఉంటుంది. గత 20 సంవత్సరాల (2005-2024) గణాంకాలను పరిశీలిస్తే, 2015 మినహా మిగిలిన అన్ని సంవత్సరాల్లోనూ ఐఎండీ అంచనాలు దాదాపుగా సరైనవేనని తేలింది. 2015లో మాత్రం అంచనా వేసిన తేదీ (మే 30) కన్నా వాస్తవ ప్రవేశం (జూన్ 5) నాలుగు రోజుల పరిమితిని దాటింది.
ఐఎండీ తన నమూనాలలో ఉపయోగించే ఆరు ప్రధాన సూచికలలో వాయువ్య భారతదేశంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు, దక్షిణ ద్వీపకల్పంలో రుతుపవనాలకు ముందు కురిసే వర్షపాతం, ఉపఉష్ణమండల వాయువ్య పసిఫిక్ మహాసముద్రంపై సగటు సముద్ర మట్ట పీడనం, దక్షిణ చైనా సముద్రంపై అవుట్గోయింగ్ లాంగ్వేవ్ రేడియేషన్ (OLR), ఈశాన్య హిందూ మహాసముద్రంలో దిగువ ట్రోపోస్ఫిరిక్ జోనల్ గాలి, మరియు ఇండోనేషియా ప్రాంతంలో ఎగువ ట్రోపోస్ఫిరిక్ జోనల్ గాలి వంటివి ఉన్నాయి.
కాగా, ఈ ఏడాది (జూన్-సెప్టెంబర్) వర్షాకాలంలో దేశవ్యాప్తంగా 'సాధారణం కంటే ఎక్కువ' వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ గత నెలలోనే అంచనా వేసిన విషయం తెలిసిందే. ఇది రైతులకు మరింత ఊరటనిచ్చే అంశం.