Congress: కాల్పుల విరమణ ఒప్పందంపై స్పందించిన కాంగ్రెస్

- ఈరోజు సాయంత్రం నుంచి కాల్పుల విరమణ అమల్లోకి!
- అఖిలపక్ష భేటీకి కాంగ్రెస్ డిమాండ్
- పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరపాలన్న జైరామ్ రమేశ్
భారత్, పాకిస్థాన్ కాల్పుల విరమణపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ఈ మొత్తం ఉదంతాన్ని పార్లమెంటుకు వివరించాలని ప్రభుత్వాన్ని కోరింది.
భారత్, పాకిస్థాన్లు కాల్పుల విరమణకు అంగీకరించాయని, ఇందుకు అమెరికా మధ్యవర్తిత్వం వహించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈరోజు సాయంత్రం ఐదు గంటల నుంచి కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిందని భారత ప్రభుత్వం ప్రకటించింది. దీనికి రెండు దేశాలు అంగీకరించినట్లు విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు.
కాల్పుల విరమణపై కాంగ్రెస్ పార్టీ నేత జైరామ్ రమేశ్ స్పందించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని, రాజకీయ పార్టీలను ఆహ్వానించాలని సూచించారు. పర్యాటకులపై ఉగ్రదాడి, తదనంతర ఉద్రిక్త పరిణామాలపై చర్చించడానికి, పార్లమెంటును ప్రత్యేకంగా సమావేశపరచాలని సూచించారు.