Hyderabad Police: హైదరాబాద్లో భద్రత కట్టుదిట్టం... డ్రోన్లు, బాణసంచాపై నిషేధం

- శంషాబాద్ ఎయిర్పోర్టకు 10 కి.మీ. పరిధిలో డ్రోన్లపై ఆంక్షలు
- జంట నగరాల్లో టపాసుల మోతపై నిషేధాజ్ఞలు
- డ్రోన్లు ఎగరేయొద్దు, టపాసులు కాల్చవద్దని పోలీసుల హెచ్చరిక
హైదరాబాద్ నగరంలో భద్రతా చర్యలను మరింత పటిష్టం చేస్తూ పోలీసులు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయ పరిసర ప్రాంతాల్లో డ్రోన్ల వినియోగాన్ని నిషేధించగా, జంట నగరాలైన హైదరాబాద్, సికింద్రాబాద్లలో బాణసంచా కాల్చడంపై ఆంక్షలు విధించారు. ఈ మేరకు సైబరాబాద్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్లు వేర్వేరుగా ఉత్తర్వులు జారీ చేశారు.
శంషాబాద్ పరిసరాల్లో డ్రోన్లపై నిషేధం
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి 10 కిలోమీటర్ల పరిధిలో డ్రోన్లు, పారాగ్లైడర్లు, గాలిలో ఎగిరే ఇతర వస్తువుల వినియోగంపై నిషేధం విధిస్తున్నట్లు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాశ్ మహంతి ప్రకటించారు. ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఈ ఆంక్షలు తక్షణమే అమల్లోకి వస్తాయని, జూన్ 9వ తేదీ వరకు కొనసాగుతాయని స్పష్టం చేశారు. విమానాల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా, భద్రతాపరమైన సమస్యలు తలెత్తకుండా ఉండేందుకే ఈ చర్యలు తీసుకున్నట్లు ఆయన వివరించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
జంట నగరాల్లో బాణసంచాపై ఆంక్షలు
హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల పరిధిలో బాణసంచా కాల్చడంపై నిషేధం విధిస్తున్నట్లు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని, ప్రత్యేకించి బహిరంగ ప్రదేశాలు, కంటోన్మెంట్ ప్రాంతాల్లో బాణసంచా కాల్చరాదని ఆయన ఆదేశించారు.
బాణసంచా పేలుళ్ల వల్ల వచ్చే ఆకస్మిక పెద్ద శబ్దాలతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యే అవకాశం ఉందని, కొన్నిసార్లు ఇలాంటి శబ్దాలను ఉగ్రవాద కార్యకలాపాలుగా తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదం కూడా ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పౌరులు పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. పోలీసుల ఆదేశాలను ఉల్లంఘించి బాణసంచా కాల్చే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీపీ సీవీ ఆనంద్ తీవ్రంగా హెచ్చరించారు.