Ch Malla Reddy: మోదీ గారూ, పాకిస్థాన్ను ప్రపంచ పటంలో లేకుండా చేయండి: మాజీ మంత్రి మల్లారెడ్డి

- పాకిస్థాన్పై మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు
- మల్లారెడ్డి యూనివర్సిటీలో సైన్యానికి మద్దతుగా 'ఆపరేషన్ సిందూర్' పేరిట ర్యాలీ
- కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి హరీశ్ రావు, ఎమ్మెల్యే వివేకానంద
- పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని పోషిస్తోందని మల్లారెడ్డి ఆరోపణ
మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి పాకిస్థాన్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. భారత్తో కయ్యానికి కాలు దువ్వుతున్న పాకిస్థాన్ను ప్రపంచ పటం నుంచే తొలగించాలని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ సైనికులకు సంఘీభావం తెలిపే కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారంలోని మల్లారెడ్డి విశ్వ విద్యాపీఠంలో భారత సైన్యానికి మద్దతుగా ఆపరేషన్ సిందూర్ పేరిట సంఘీభావ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రులు హరీశ్ రావు, మల్లారెడ్డితో పాటు స్థానిక ఎమ్మెల్యే కేపీ వివేకానంద, విద్యార్థులు, బీఆర్ఎస్ నాయకులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లారెడ్డి మాట్లాడుతూ, "పాకిస్థాన్తో మనం ఇప్పటికీ బాధలు పడుతూనే ఉన్నాం. వాళ్లు ఉగ్రవాదులను పోషిస్తున్నారు" అని మల్లారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి, "మోదీజీ, పాకిస్థాన్ను లేపేయండి. పాకిస్థాన్ను ముక్కలు ముక్కలు చేసి ప్రపంచ మ్యాప్లో లేకుండా చేయండి. మనకు స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు అయింది. కానీ అదే పాక్తో ఎప్పటికీ ఇబ్బందులు పడుతున్నాం" అన్నారు. పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని సమూలంగా నాశనం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎలాంటి త్యాగానికైనా సిద్ధంగా ఉండాలని ప్రజలకు మల్లారెడ్డి పిలుపునిచ్చారు. "మనం సరిహద్దుల్లో పోరాటం చేయలేకపోవచ్చు, కానీ మన సైనికుల కోసం కనీసం రక్తదానం చేయడానికైనా సిద్ధంగా ఉండాలి" అని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న హరీశ్ రావు, మల్లారెడ్డి, వివేకానంద త్రివర్ణ పతాకాలను చేతబట్టి సైన్యానికి మద్దతుగా నినాదాలు చేశారు.