Pakistan: భారత్పై దాడులకు ఫతా-2 క్షిపణిని ప్రయోగించిన పాకిస్థాన్.. దీనినే ఎందుకు బయటకు తీసింది?

- పాక్ 'ఫతా-2' క్షిపణిని కూల్చేసిన భారత్
- జమ్మూ వైమానిక స్థావరంపై దాడికి పాక్ విఫలయత్నం
- గురువారం నుంచి పలు నగరాలపై పాక్ దాడులు
భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరిన వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. పాకిస్థాన్ ప్రయోగించిన ‘ఫతా-2’ అనే శక్తిమంతమైన క్షిపణిని భారత సాయుధ దళాలు శనివారం తెల్లవారుజామున హర్యానాలోని సిర్సా వద్ద విజయవంతంగా అడ్డుకున్నాయి. అదే సమయంలో జమ్మూలోని వైమానిక దళ స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని పాకిస్థాన్ చేసిన మరో దాడి యత్నాన్ని కూడా భారత బలగాలు భగ్నం చేశాయి.
గురువారం నుంచి పాకిస్థాన్ సైన్యం భారత నగరాలపై అకారణంగా దాడులకు పాల్పడుతున్న నేపథ్యంలో ఈ ఘటన జరిగింది. రాజస్థాన్, గుజరాత్, జమ్మూకశ్మీర్ సరిహద్దు ప్రాంతాల్లో పాకిస్థాన్ ఆత్మాహుతి డ్రోన్లు, క్షిపణులు, ఫిరంగి దాడులు చేస్తున్న దరిమిలా పలు భారతీయ నగరాల్లో హై అలర్ట్ ప్రకటించారు.
భారత్ అడ్డగించిన ఫతా-2 క్షిపణి విషయానికొస్తే.. ఇది 400 కిలోమీటర్ల పరిధి కలిగిన హైపర్సోనిక్ బాలిస్టిక్ క్షిపణి. ఇది మార్గనిర్దేశిత ఆర్టిలరీ రాకెట్ వ్యవస్థ కావడం వల్ల కచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదించగలదు. సంప్రదాయ ఆయుధాలతో పాటు అవసరమైతే వ్యూహాత్మక అణ్వాయుధాలను కూడా మోసుకెళ్లగలదని తెలుస్తోంది. ఫతా-1కి ఇది ఆధునిక వెర్షన్ కాగా, అమెరికాకు చెందిన హెచ్ఐఎంఏఆర్ఎస్-జీఎంఎల్ఆర్ఎస్, చైనా పీహెచ్ఎల్ సిరీస్ గైడెడ్ రాకెట్ వ్యవస్థలను పోలి ఉంటుంది. ఈ క్షిపణికి అణు రహితంగా కూడా కచ్చితమైన దాడులు చేసే సామర్థ్యం ఉండటం వల్ల, యుద్ధరంగంలో వ్యూహాత్మక అణ్వాయుధాలపై ఆధారపడటాన్ని ఇది తగ్గిస్తుందని నిపుణులు భావిస్తున్నారు.