Bangladesh: భారత్, పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తత.. బంగ్లాదేశ్ కీలక నిర్ణయం!

- పాక్ గగనతలం వైపు తమ విమానాల రాకపోకలను నిలిపివేసిన బంగ్లా
- తమ విమానాలను టొరంటో, రోమ్, లండన్లకు రీ షెడ్యూల్ చేసినట్లు బిమాన్ ప్రకటన
- ఈ నిర్ణయం మే 9 నుంచి మే 31 వరకు అమలులో ఉంటుందని వెల్లడి
భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో పొరుగు దేశం బంగ్లాదేశ్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. పాక్ గగనతలం వైపు తమ విమానాల రాకపోకలను నిలిపివేసింది. ఆ దేశ జాతీయ విమానయాన సంస్థ బిమాన్ ఎయిర్లైన్స్ తమ విమానాలను టొరంటో, రోమ్, లండన్లకు రీ షెడ్యూల్ చేసినట్లు ప్రకటించింది.
ఈ నిర్ణయం శుక్రవారం (మే 9) నుంచి మే 31 వరకు అమలులో ఉంటుందని ఎయిర్లైన్స్ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. పాక్ తాత్కాలికంగా గగనతలాన్ని మూసివేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు బంగ్లాదేశ్ వెల్లడించింది.
సవరించిన విమాన షెడ్యూల్ ఇలా...
ఢాకా-టొరంటో (BG305/306): ఢాకా నుంచి బయలుదేరే సమయం 45 నిమిషాలు ముందుకు జరిపారు. ప్రస్తుతం ఉదయం 3:45 గంటలకు బదులుగా ఉదయం 3 గంటలకు షెడ్యూల్ చేశారు. అయితే, టొరంటో నుంచి తిరుగు ప్రయాణ షెడ్యూల్లో ఎటువంటి మార్పు ఉండదు.
ఢాకా-లండన్ (BG201/202): ఢాకా నుంచి రెగ్యులర్ గా బయలుదేరే విమానాలు ఇప్పుడు ఉదయం 7 గంటలకు షెడ్యూల్ చేశారు. ఈ సర్వీస్ ఇంతకుముందు ఉదయం 7:40 గంటలకు ఉండేది. లండన్-ఢాకా తిరుగు ప్రయాణ షెడ్యూల్లో ఎటువంటి మార్పు లేదు. అయితే, గురువారం మాత్రం ఈ విమానం ఉదయం 8:50కి బదులుగా ఉదయం 8:10కి బయలుదేరుతుంది.
ఢాకా-రోమ్ (BG355/356): ఢాకా నుంచి బయలుదేరే సమయం ఇప్పుడు ఉదయం 10:45 గంటలకు మార్చారు. ఇది ఇంతకుముందు ఉదయం 11:30 గంటలకు ఉండేది. ఇప్పుడు 45 నిమిషాలు ముందుగా ఉంటుంది. రోమ్ నుంచి తిరుగు ప్రయాణ షెడ్యూల్లో ఎటువంటి మార్పు లేదు.
ఇక, సవరించిన విమాన సమయాలకు అనుగుణంగా ప్రయాణీకులందరూ చెక్-ఇన్ కౌంటర్లకు రిపోర్ట్ చేయాలని బిమాన్ అభ్యర్థించింది. ఈ తాత్కాలిక షెడ్యూల్ సర్దుబాట్ల వల్ల కలిగే అసౌకర్యానికి విమానయాన సంస్థ క్షమాపణలు కూడా చెప్పింది.