Andhra Pradesh: భానుడి భగభగ... ప్రకాశం జిల్లాలో 42 డిగ్రీల ఉష్ణోగ్రత

- ప్రకాశం దరిమడుగులో 42°C, తిరుపతి గంగుడుపల్లెలో 41.3°C
- కోనసీమ ఆత్రేయపురంలో 63.7మిమీ, చొప్పెలలో 55మిమీ వర్షపాతం
- రేపు 3 మండలాల్లో తీవ్ర వడగాలులు, 23 మండలాల్లో వడగాలులు.
- అల్లూరి, చిత్తూరు, అన్నమయ్య, శ్రీసత్యసాయి జిల్లాల్లో పిడుగులతో వర్షాలు.
- ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీఎస్డీఎంఏ సూచన
ఏపీలో కొన్ని జిల్లాల్లో భానుడు ప్రతాపం చూపిస్తుండగా, మరికొన్ని ప్రాంతాల్లో ఆకస్మిక వర్షాలు కురుస్తున్నాయి. నేడు రాష్ట్రంలోని పలుచోట్ల అధిక ఉష్ణోగ్రతలు నమోదవగా, కొన్ని ప్రాంతాల్లో వర్షం పాతం నమోదైంది. రేపు శనివారం కూడా ఇదే తరహా వాతావరణం కొనసాగే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) కీలక సూచనలు జారీ చేసింది.
ఇవాళ ప్రకాశం జిల్లా దరిమడుగులో అత్యధికంగా 42 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు కాగా, తిరుపతి జిల్లా గంగుడుపల్లెలో 41.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైనట్లు ఏపీఎస్డీఎంఏ తెలిపింది.
మరోవైపు, కొన్ని జిల్లాల్లో వాతావరణం చల్లబడింది. కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో అత్యధికంగా 63.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, అదే జిల్లా చొప్పెలలో 55 మిల్లీమీటర్ల వర్షం కురిసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఆకస్మిక వర్షాలతో కొన్ని ప్రాంతాల్లో వాతావరణం ఆహ్లాదకరంగా మారింది.
వాతావరణ సూచన
రేపు శనివారం రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల నుంచి 43.5 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉందని ఏపీఎస్డీఎంఏ అంచనా వేసింది. మూడు మండలాల్లో తీవ్ర వడగాలులు, మరో 23 మండలాల్లో వడగాలుల ప్రభావం చూపే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రజలు, ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు, అనారోగ్య సమస్యలు ఉన్నవారు మధ్యాహ్న సమయంలో బయటకు వెళ్లకపోవడం మంచిదని సూచించింది.
అదే సమయంలో, రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని ఏపీఎస్డీఎంఏ పేర్కొంది. అల్లూరి సీతారామరాజు, చిత్తూరు, అన్నమయ్య, శ్రీసత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇతర జిల్లాల్లో కూడా చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు పడే సూచనలున్నాయని వివరించింది.