Pakistani Citizen: ఆపరేషన్ సిందూర్ పై పాక్ పౌరుడి రియాక్షన్.. వైరల్ గా మారిన వీడియో ఇదిగో!

- పాక్ నిస్సహాయతపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన పౌరుడు
- ఉగ్రవాద క్యాంపులపై భారత్ దాడి చేసింది కాబట్టి సరిపోయిందని వ్యాఖ్య
- 24 మిసైళ్లు ప్రయోగిస్తే మేం ఒక్క దానిని కూడా అడ్డుకోలేకపోయామని ఆవేదన
- సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారంపై సొంత ప్రభుత్వాన్ని ఎండగట్టిన నెటిజన్
పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే), పాకిస్థాన్ లలోని 9 ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం మెరుపుదాడులు చేసిన విషయం తెలిసిందే. ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో ఉగ్రవాద స్థావరాలపై మొత్తం 24 క్షిపణులు ప్రయోగించి వాటిని నేలమట్టం చేసింది. ఈ ఆపరేషన్ పై స్పందిస్తూ పాకిస్థాన్ పౌరుడు ఒకరు సెల్ఫీ వీడియో తీసి ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. ఇందులో పాక్ నిస్సహాయతను, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాన్ని ఆయన తీవ్రంగా విమర్శించారు. పాక్ డిఫెన్స్ వ్యవస్థ వైఫల్యాన్ని ఎండగట్టారు.
భారత సైన్యం ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణులు ప్రయోగించిందని, మొత్తం 24 క్షిపణులు ప్రయోగిస్తే అవన్నీ టార్గెట్లను ఛేదించాయని ఆ యువకుడు చెప్పారు. అందులో ఒక్క క్షిపణిని కూడా తమ సైన్యం, డిఫెన్స్ వ్యవస్థ అడ్డుకోలేకపోయిందని వాపోయారు. భారత సైన్యం చేయాలనుకున్నది చేసి చూపించిందని పేర్కొన్నారు. ఉగ్రవాద క్యాంపులను టార్గెట్ చేసింది కాబట్టి సరిపోయింది కానీ సాధారణ జనావాసాలపై దాడులు చేస్తే అల్లకల్లోలం జరిగేదన్నారు. పాక్ భూభాగంపై ఎక్కడ దాడి చేసినా అడ్డుకునే శక్తి తమ ప్రభుత్వానికి, సైన్యానికి లేదని చెప్పారు.
ఇరాన్ వందలు, వేలాదిగా క్షిపణులు ప్రయోగించినా అందులో ఒకటో రెండో ఇజ్రాయెల్ భూభాగంపై పడతాయి, మిగతా వాటిని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ గాల్లోనే అడ్డుకుని కూల్చేస్తుందని పాక్ పౌరుడు గుర్తుచేశారు. అలాంటి డిఫెన్స్ వ్యవస్థ పాక్ దగ్గర లేకపోవడం దురదృష్టకరమని చెప్పారు. ఇదిలా ఉండగా.. భారత సైన్యం చేసిన దాడిని అడ్డుకోవడంలో విఫలమైన సైన్యం, ప్రభుత్వం.. సోషల్ మీడియాలో తప్పుడు వార్తల ప్రచారంలో మాత్రం సూపర్ గా దూసుకుపోతోందని విమర్శించారు. భారత్ సైన్యాన్ని అడ్డుకున్నామని, శత్రువుల యుద్ధ విమానాలను కూల్చివేశామని, భారత భూభాగంపై తీవ్రమైన దాడులతో జవాబిచ్చామని మూడు నాలుగేళ్ల ఫొటోలు, వీడియోలు పెడుతున్నారని మండిపడ్డారు. ఆ వార్తలు, ఫొటోలు, వీడియోలు చూస్తే మూడేళ్ల కిందటివి, వేరే దేశాలవని తెలుస్తోందని చెప్పారు. కాగా, సొంత ప్రభుత్వం, సైన్యం నిస్సహాయతను ఎత్తిచూపుతూ పాక్ పౌరుడు సోషల్ మీడియాలో పెట్టిన ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.