ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మరో పథకం ప్రారంభించాం: సీఎం చంద్రబాబు
- నేడు మత్స్యకారుల సేవలో పథకం ప్రారంభించిన కూటమి ప్రభుత్వం
- శ్రీకాకుళం జిల్లా బుడగట్లపాలెం గ్రామంలో చంద్రబాబు పర్యటన
- మత్స్యకారులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్న వైనం
వేట నిషేధ సమయంలో ఆదాయం లేక మత్స్యకారులు పడే ఇబ్బందులను తాను ప్రత్యక్షంగా చూశానని, వారి కష్టాలను దృష్టిలో ఉంచుకొనే ఈ సాయాన్ని రెట్టింపు చేయాలని నిర్ణయించినట్లు చంద్రబాబు తెలిపారు. కష్టపడి పనిచేసే స్వభావం ఉన్నవారికి అండగా నిలవడం ప్రభుత్వ ప్రాథమిక కర్తవ్యమని స్పష్టం చేశారు.
ఈ పథకం ప్రారంభం సందర్భంగా తాను శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గ పరిధిలోని బుడగట్లపాలెం గ్రామాన్ని సందర్శించినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. అక్కడ మత్స్యకార సోదరులతో నేరుగా మాట్లాడి వారి సాధకబాధకాలను అడిగి తెలుసుకున్నానని వివరించారు. ప్రభుత్వ పరంగా వారికి అన్ని విధాలా మేలు చేసే కార్యక్రమాలు చేపడతామని భరోసా ఇచ్చినట్లు తెలిపారు. ఆ కష్టజీవులతో గడిపిన సమయం, రాష్ట్ర ప్రజల కోసం మరింత కష్టపడి పనిచేయాలనే తన సంకల్పాన్ని మరింత దృఢపరిచిందని చంద్రబాబు వ్యాఖ్యానించారు.


