తిరుపతిలో డ్రోన్ పోలీసింగ్... అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం
- తిరుపతిలో పోలీసుల డ్రోన్ నిఘా వ్యవస్థ పటిష్టం
- రాత్రిపూట అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి
- గంజాయి, పేకాట, బహిరంగ మద్యంపై డ్రోన్లతో నిఘా
- థర్మల్ డ్రోన్లతో నిర్మానుష్య ప్రాంతాల్లోనూ గస్తీ
రాష్ట్రంలోనే తొలిసారిగా తిరుపతిలో మాట్రిక్స్ ఫోర్ థర్మల్ డ్రోన్లను రాత్రి గస్తీ కోసం ఉపయోగిస్తున్నారు. ఈ డ్రోన్ల సహాయంతో అనుమానిత ప్రాంతాలను సులువుగా గుర్తించి, తక్షణమే చర్యలు తీసుకుంటున్నారు. అర్ధరాత్రి దాటిన తర్వాత అనవసరంగా రోడ్లపై తిరిగే వారిని, బైక్లతో విన్యాసాలు చేసే యువతను అదుపులోకి తీసుకుంటున్నారు.
డ్రోన్ల వినియోగం వల్ల మారుమూల ప్రాంతాలకు సైతం వేగంగా చేరుకొని నిఘా పెట్టడం సులభమైందని, దీనివల్ల పోలీసుల సమయం, శ్రమ ఆదా అవుతోందని జిల్లా ఎస్పీ తెలిపారు. జిల్లా కలెక్టర్ సహకారంతో అదనంగా ఐదు డ్రోన్లు సమకూర్చుకున్నామని, ఇవి శాంతి భద్రతల పర్యవేక్షణతో పాటు ట్రాఫిక్ నియంత్రణకు కూడా ఉపయోగపడుతున్నాయని ఆయన వివరించారు. డ్రోన్ల నిఘాతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిలో భయం నెలకొందని, నగరంలో నేరాల నియంత్రణకు ఇది ఎంతగానో దోహదపడుతుందని అధికారులు పేర్కొంటున్నారు.