Vinay Narwal: నేవీ అధికారి భౌతికకాయానికి నిబ్బరంగా సెల్యూట్ చేసిన భార్య... గుండెలు పిండేసే వీడియో ఇదిగో!

- కాశ్మీర్లోని పహల్గామ్ వద్ద బైసరన్లో ఉగ్రవాదుల దాడి
- భారత నౌకాదళ లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ (26) దుర్మరణం
- పెళ్లయిన వారం రోజులకే హనీమూన్లో విషాద ఘటన
- భర్త శవపేటిక వద్ద భార్య హిమాన్షి భావోద్వేగ వీడ్కోలు
ఆ జంటకు పెళ్లయి వారం రోజులు కూడా కాలేదు. కొత్త జీవితాన్ని ఆనందంగా ప్రారంభించేందుకు హనీమూన్ కోసం కాశ్మీర్ వెళ్లారు. కానీ విధి వక్రించింది. ఉగ్రవాదుల రూపంలో మృత్యువు కాటేసింది. హనీమూన్లో ఉండగానే భర్త ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోవడంతో ఆ నవ వధువు గుండెలు పగిలేలా రోదించింది. భర్త శవపేటికను హత్తుకుని కన్నీరుమున్నీరైంది. అంతటి దుఃఖంలోనూ ఆమె ప్రదర్శించిన ధైర్యం, దేశభక్తి అందరినీ కదిలించింది. నిటారుగా నిలబడి, భర్తకు సెల్యూట్ చేసి, 'జై హింద్' అంటూ వీరనారిలా తుది వీడ్కోలు పలికింది.
హర్యానాలోని కర్నాల్కు చెందిన వినయ్ నర్వాల్ (26) భారత నౌకాదళంలో లెఫ్టినెంట్గా పనిచేస్తున్నారు. ఏప్రిల్ 16న ఆయనకు హిమాన్షితో వివాహం జరిగింది. మూడు రోజుల తర్వాత ఏప్రిల్ 19న రిసెప్షన్ వేడుక నిర్వహించారు. అనంతరం సోమవారం (ఏప్రిల్ 21) నవ దంపతులు హనీమూన్ కోసం కాశ్మీర్కు బయలుదేరారు. మరుసటి రోజు మంగళవారం, 'మినీ స్విట్జర్లాండ్'గా పేరుగాంచిన పహల్గామ్ సమీపంలోని బైసరన్ అనే సుందర ప్రదేశంలో ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నారు.
ఇద్దరూ కలిసి భేల్ పూరి తింటున్న సమయంలో ఓ ఉగ్రవాది అక్కడికి వచ్చి లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ తలపై అతి సమీపం నుంచి కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో నర్వాల్ అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. భర్త రక్తం ఆమె ముఖంపై చిమ్మింది. "మేము భేల్ పూరి తింటున్నాం. అంతలో ఒక వ్యక్తి వచ్చి నా భర్తను కాల్చేశాడు" అని హిమాన్షి తీవ్ర దిగ్భ్రాంతితో చెప్పిన మాటలు అక్కడి వీడియోలో నమోదయ్యాయి.
నేడు లెఫ్టినెంట్ నర్వాల్ భౌతిక కాయాన్ని ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తరలించారు. శవపేటిక పక్కనే నిలబడి హిమాన్షి విలపించిన తీరు అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది. "ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను. ఆయన గర్వపడేలా మేం నడుచుకుంటాం" అంటూ శవపేటికను హత్తుకుని రోదించారు. "ఆయన లాంటి వారి వల్లే ఈ ప్రపంచం ఇంకా మనుగడ సాగిస్తోంది. మనమందరం ఆయనను చూసి గర్వపడాలి" అంటూ పదేపదే శవపేటిక ముందు తలవంచి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులు ఆమెను ఓదార్చే ప్రయత్నం చేశారు.
అనంతరం, ఆమె తన కన్నీళ్లను తుడుచుకుని, ధైర్యం కూడగట్టుకుని, నిటారుగా నిలబడ్డారు. నౌకాదళ అధికారులు, ఇతర ప్రముఖులు చూస్తుండగానే భర్తకు సెల్యూట్ చేసి, గంభీరంగా "జై హింద్" అని నినదించారు. ఈ దృశ్యం చూపరుల గుండెలను పిండేసింది. అక్కడే ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా కూడా నర్వాల్ భౌతిక కాయానికి నివాళులర్పించి, హిమాన్షిని ఓదార్చారు.
రెండేళ్ల క్రితమే నౌకాదళంలో చేరిన వినయ్ నర్వాల్ ప్రస్తుతం కొచ్చిలో విధులు నిర్వర్తిస్తున్నారు. బైసరన్లో జరిగిన ఉగ్రదాడిలో నర్వాల్తో పాటు ఓ ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారి సహా మొత్తం 26 మంది ప్రాణాలు కోల్పోయారు.
లెఫ్టినెంట్ నర్వాల్ తాత హవా సింగ్ (బీఎస్ఎఫ్ మాజీ ఉద్యోగి) మాట్లాడుతూ, తన మనవడికి చిన్నప్పటి నుంచే దేశానికి సేవ చేయాలనే బలమైన కోరిక ఉండేదని తెలిపారు. "చిన్నప్పుడు సైనిక వాహనాలను చూసినప్పుడల్లా వాటి గురించి ఎన్నో ప్రశ్నలు అడిగేవాడు. సరిహద్దుల్లో పని ఎంత కష్టమో నాకు తెలుసు కాబట్టి, ఈ మార్గం వద్దని చెప్పాను. కానీ వాడు వినలేదు. సర్వీసెస్ సెలక్షన్ బోర్డు ద్వారా నేరుగా ఎంపికై, నేవీలో చేరాడు. 18 నెలల క్రితమే లెఫ్టినెంట్గా పదోన్నతి పొందాడు" అని గర్వంగా చెబుతూనే, మనవడిని కోల్పోయినందుకు కన్నీటిపర్యంతమయ్యారు. "ఇక వాడిని తిరిగి తీసుకురాలేము కదా" అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.