Ram Mohan Naidu: శ్రీనగర్ నుంచి అమాంతం పెరిగిన టిక్కెట్ ధరలు.. రామ్మోహన్ నాయుడు కీలక ఆదేశాలు

- పహల్గాం ఉగ్రదాడి తర్వాత శ్రీనగర్ విమాన ఛార్జీల నియంత్రణపై కేంద్రం చర్యలు
- విమాన ఛార్జీలు పెంచరాదని సంస్థలకు మంత్రి రామ్మోహన్ నాయుడు ఆదేశం
- పర్యాటకుల తరలింపునకు అదనపు విమానాల ఏర్పాటు
- టికెట్ రద్దు, మార్పు రుసుములు రద్దు చేసిన ఎయిర్లైన్స్
- 6 గంటల్లో 3,337 మంది ప్రయాణించిన వైనం
జమ్ముకాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో శ్రీనగర్ నుంచి విమాన ప్రయాణ ఛార్జీలను అదుపులో ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టింది. విమాన టికెట్ ధరలను విపరీతంగా పెంచవద్దని అన్ని విమానయాన సంస్థలకు కఠిన ఆదేశాలు జారీ చేసినట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు.
ఉగ్రదాడి అనంతరం శ్రీనగర్ నుంచి ప్రధాన నగరాలకు విమాన టికెట్ల ధరలు అమాంతం పెరిగాయి. ఢిల్లీ, ముంబై వంటి నగరాలకు టికెట్ ధరలు కొన్ని సందర్భాల్లో రూ. 20,000 దాటాయి. పలు విమానయాన సంస్థల ఆన్లైన్ పోర్టళ్లలో టికెట్లు అమ్ముడైపోయాయని లేదా పరిమిత సంఖ్యలో అధిక ధరలకు అందుబాటులో ఉన్నాయని కనిపించింది. ఈ పరిణామాల నేపథ్యంలో మంత్రిత్వ శాఖ జోక్యం చేసుకుంది.
శ్రీనగర్ నుంచి పర్యాటకుల సురక్షిత ప్రయాణానికి నిరంతరం కృషి చేస్తున్నామని రామ్మోహన్ నాయుడు తెలిపారు. విమాన ఛార్జీలు పెంచకుండా ఉండేందుకు విమానయాన కంపెనీలకు కఠిన ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. ఛార్జీలను పర్యవేక్షిస్తూ సహేతుకమైన స్థాయిలో ఉండేలా చూస్తున్నట్లు వెల్లడించారు.
పర్యాటకుల సౌకర్యార్థం, చిక్కుకుపోయిన వారిని తరలించేందుకు అదనపు విమాన సర్వీసులను నడుపుతున్నట్లు ఆయన ధృవీకరించారు. తొలుత ఢిల్లీ, ముంబైలకు చెరో రెండు చొప్పున మొత్తం నాలుగు అదనపు విమానాలను మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది.
బుధవారం నాడు ఢిల్లీకి మరో మూడు అదనపు విమానాలను నడిపారు. వాటిలో ఇండిగో 6E 3203 (సాయంత్రం 5 గంటలకు బయలుదేరి 6 గంటలకు చేరుకుంటుంది), ఇండిగో 6E 3103 (సాయంత్రం 6 గంటలకు బయలుదేరి 7:30 గంటలకు చేరుకుంటుంది), రాత్రి 10:30 గంటలకు స్పైస్జెట్ విమానం బయలుదేరుతుంది.
శ్రీనగర్ నుంచి పనిచేస్తున్న అన్ని విమానయాన సంస్థలు టికెట్ల రద్దు, ప్రయాణ తేదీ మార్పులపై విధించే రుసుములను రద్దు చేశాయని రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఇది మానవత్వం, సంఘీభావం చూపించాల్సిన సమయమని కేంద్ర మంత్రి అన్నారు. ప్రతి పౌరుడికి అండగా ఉంటామని, అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తామని ఆయన తెలిపారు.
ప్రయాణికుల రద్దీ పెరిగిన నేపథ్యంలో శ్రీనగర్ విమానాశ్రయంలో సౌకర్యాలను విస్తరించారు. బుధవారం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య విమానాశ్రయం నుంచి 20 విమానాలు బయలుదేరాయని, మొత్తం 3,337 మంది ప్రయాణికులు వెళ్లారని మంత్రి తెలిపారు. ప్రయాణికుల కోసం ఆహారం, నీరు పంపిణీ చేస్తున్నామని, టెర్మినల్ వెలుపల వేచి ఉండే వారి కోసం అదనంగా ఒక టెంట్ను ఏర్పాటు చేశామని ఆయన వివరించారు.
ఇదిలా ఉండగా, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) కూడా బుధవారం ఒక అడ్వైజరీని జారీ చేసింది. శ్రీనగర్ నుంచి విమాన సర్వీసుల సంఖ్యను పెంచాలని, బుకింగ్ మార్పులపై రుసుంలను రద్దు చేయాలని ఎయిర్ ఇండియా, ఇండిగో సహా అన్ని వాణిజ్య విమానయాన సంస్థలను కోరింది. పర్యాటకుల నుంచి ఊహించని డిమాండ్ కారణంగా శ్రీనగర్ నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు నిరంతరాయ కనెక్టివిటీ అవసరమని డీజీసీఏ నొక్కి చెప్పింది.