Revanth Reddy: దొంగ దెబ్బతో ఆత్మస్థైర్యం దెబ్బతీయలేరు: జమ్మూకశ్మీర్ ఉగ్రదాడిపై రేవంత్ రెడ్డి

- ఈ దాడి దిగ్భ్రాంతిని కలిగించిందన్న ముఖ్యమంత్రి
- ఉగ్రవాద మూకల విషయంలో కఠినంగా వ్యవహరించాలని కేంద్రానికి విజ్ఞప్తి
- పిరికిపంద చర్యగా అభివర్ణించిన కిషన్ రెడ్డి
జమ్మూకశ్మీర్లోని పహల్గాం ఉగ్రవాద దాడి ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన 'ఎక్స్' వేదికగా ట్వీట్ చేశారు. ఉగ్రవాదుల కాల్పుల్లో పర్యాటకులు మృతి చెందిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని పేర్కొన్నారు. ఈ దుశ్చర్యను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.
ఇటువంటి పిరికి చర్య, దొంగ దెబ్బలతో భారతీయుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరని, ఉగ్రవాద మూకల విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నానని పేర్కొన్నారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
పిరికిపంద చర్య: కిషన్ రెడ్డి
పహల్గాంలో ఉగ్రవాద దాడి ఘటనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కలత చెందినట్లు తెలిపారు. మృతుల కుటుంబాలకు ఆయన సంతాపం తెలియజేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జాతి మొత్తం ఏకతాటిపై ఉంటుందని అన్నారు. అమాయక పౌరులపై ఉగ్రవాద దాడి పిరికిపంద చర్యగా అభివర్ణించారు. ఉగ్రవాద కారకులను వదిలిపెట్టే ప్రసక్తి లేదని హెచ్చరించారు.
ఉగ్ర దాడిపై మరో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ కిరాతక దాడికి పాల్పడిన వారు తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.