Ilayaraja: నా పాట వినడానికి ఏనుగుల గుంపు వచ్చింది: ఇళయరాజా

- తన సంగీతం విని ఒక చిన్నారి తిరిగి శ్వాస తీసుకుందన్న ఇళయరాజా
- తనకు పొగరు ఉందని వ్యాఖ్య
- తన సంగీతాన్ని వినడమే ఒక కళ అన్న మ్యూజిక్ మేస్ట్రో
మన దేశ అత్యుత్తమ సినీ సంగీత దర్శకులలో ఇళయరాజా కూడా ఒకరు. ఆయన సంగీతాన్ని ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. ఇప్పటి వరకు ఆయన 1,500కు పైగా సినిమాలకు సంగీతం అందించారు. 7 వేలకు పైగా పాటలను అందించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
తన సంగీతానికే కాదు, తన ప్రతిభకు కూడా తాను గర్వపడతానని ఇళయరాజా అన్నారు. తనకు పొగరు ఉందని.... ఎందుకంటే టాలెంట్ ఉన్నవారికే పొగరు ఉంటుందని చెప్పారు. తన సంగీతం విని ఒక చిన్నారి తిరిగి శ్వాస తీసుకుందని... ఒకసారి తన పాట వినడానికి ఏనుగుల గుంపు వచ్చిందని అన్నారు.
తన సంగీతం వినడమే ఒక కళ అని చెప్పారు. తాను కంపోజ్ చేసిన పలు పాటల ద్వారా వెస్టర్న్ క్లాసికల్ సంగీతాన్ని పరిచయం చేశానని తెలిపారు. ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొంత మంది విమర్శిస్తున్నప్పటికీ... ఆయన సాధించిన ఘనతకు అలా మాట్లాడటంలో తప్పులేదని అభిమానులు అంటున్నారు.