తొలి టీ20: సంజూ శాంసన్ సెంచరీ... టీమిండియా భారీ స్కోరు
- డర్బన్ లో తొలి టీ20
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా
- నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 202 పరుగులు చేసిన టీమిండియా
- 50 బంతుల్లో 107 పరుగులు చేసిన సంజూ శాంసన్
ఇటీవల ఓపెనర్ గా ప్రమోషన్ పొందిన సంజూ శాంసన్ తన విధ్వంసక ఫామ్ ను కొనసాగిస్తూ, మరో సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు. శాంసన్ కేవలం 50 బంతుల్లోనే 107 పరుగులు చేయడం విశేషం. ఈ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ స్కోరులో ఫోర్లు కంటే సిక్సులే ఎక్కువ ఉన్నాయంటే అతడి ఊచకోత ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. సఫారీ బౌలర్లలను సునాయాసంగా ఎదుర్కొన్న సంజు శాంసన్ 7 ఫోర్లు, 10 సిక్సులు బాదాడు.
మరో ఓపెనర్ అభిషేక్ శర్మ 7 పరుగులకే వెనుదిరిగాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 21, తెలుగుతేజం తిలక్ వర్మ 33 పరుగులు చేశారు. చివర్లో టీమిండియా వెంటవెంటనే వికెట్లు కోల్పోయింది. సఫారీ బౌలర్లలో గెరాల్డ్ కోట్జీ 3, మార్కో యన్సెన్ 1, కేశవ్ మహరాజ్ 1, పీటర్ 1, క్రూగర్ 1 వికెట్ తీశారు.