ఆడబిడ్డలపై అఘాయిత్యాలకు పాల్పడితే అదే వారికి చివరి రోజు కావాలి:చంద్రబాబు

ap cm chandrababu review on home department
  • నేరం చేస్తే శిక్షలు తప్పవనే భయం కల్పించాలన్న సీఎం  
  • పోలీసింగ్ లో స్పష్టమైన మార్పు కనిపించాలని సూచన 
  • ప్రజలకు భద్రత విషయంలో గట్టి భరోసా ఇచ్చేలా పోలీసు శాఖ పని చేయాలన్న చంద్రబాబు  
మహిళలపై హింస విషయంలో చాలా కఠినంగా ఉండాలని, ఆడ బిడ్డల జోలికి వస్తే ..అదే తనకు చివరి రోజు అనే విషయం నేరస్తులకు అర్ధం కావాలని సీఎం చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో పోలీసింగ్ లో స్పష్టమైన మార్పు కనిపించాలని, నేరం చేస్తే శిక్ష తప్పదు అనే భయం కనిపించేలా పోలీసు శాఖ పని చేయాలని సూచించారు. నేరం జరిగిన తర్వాత నేరస్తులను పట్టుకోవడం, శిక్షించడం ఒక ఎత్తు అయితే ..అసలు నేరం చేయాలంటేనే భయపడే పరిస్థితి కల్పించాలన్నారు. 
 
వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో బుధవారం హోంశాఖపై సీఎం సమీక్ష నిర్వహించారు. హోంమంత్రి వంగలపూడి అనిత, డీజీపీ ద్వారకా తిరుమలరావుతో పాటు పోలీస్ శాఖలోని ఉన్నతాధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రజలకు భద్రత విషయంలో గట్టి భరోసా ఇచ్చేలా పోలీసు శాఖ పని చేయాలని, పూర్తి స్థాయి శాంతి భద్రతలతో మళ్లీ ప్రశాంతమైన రాష్ట్రంగా ఏపీ కనిపించాలని చెప్పారు. రాజకీయ ముసుగులో ఎవరైనా అరాచకాలకు పాల్పడితే కఠినంగా వ్యవహరించాలని సీఎం అన్నారు. 
 
శాంతి భద్రతలు కాపాడే విషయంలో, నేరాల విచారణ, నేరస్తులకు శిక్షల విషయంలో అధికారులు ఫలితాలు కనిపించేలా పనిచేయాలని చంద్రబాబు సూచించారు. సమీక్షలో తొలుత గత పదేళ్లలో పోలీసు శాఖలో నెలకొన్న పరిస్థితులపై సీఎం చంద్రబాబుకు అధికారులు వివరించారు. సమీక్ష అనంతరం హోంమంత్రి అనిత మీడియాతో మాట్లాడుతూ సమావేశం వివరాలను వెల్లడించారు. గత వైసీపీ ప్రభుత్వం సీసీ కెమెరాల బిల్లులు కూడా చెల్లించలేదని విమర్శించారు. సీసీ కెమెరాల నిర్వహణ కూడా సరిగ్గా లేదని అన్నారు. మహిళల భద్రత గురించి వైసీపీ నేతలు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని అన్నారు.
Advertisement
Chandrababu
Vangalapudi Anitha
YSRCP

More Telugu News