హైబ్రిడ్ మోడల్ లో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ... టీమిండియా కోసమే!

హైబ్రిడ్ మోడల్ లో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ... టీమిండియా కోసమే!

ICC to follow hybird model in Champions Trophy
  • వచ్చే ఏడాది పాకిస్థాన్ గడ్డపై ఐసీసీ చాంపియన్ ట్రోఫీ
  • రాజకీయ, భద్రతా కారణాలతో పాకిస్థాన్ పర్యటనకు టీమిండియా విముఖత
  • భారత్ ను ఒప్పించే బాధ్యతను ఐసీసీకి అప్పగించిన పాక్ బోర్డు
  • భారత్ అనుకూల నిర్ణయం దిశగా ఐసీసీ!
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తుండగా, ఈ టోర్నీలో టీమిండియా పాల్గొనడంపై నీలినీడలు కమ్ముకున్నాయి. రాజకీయ, భద్రతా కారణాల వల్ల పాకిస్థాన్ గడ్డపై అడుగుపెట్టేందుకు టీమిండియా విముఖత వ్యక్తం చేస్తోంది. 

అయితే, భారత్ వంటి అగ్రశ్రేణి జట్టు టోర్నీలో ఆడకపోతే ఎంత నష్టం వాటిల్లుతుందో ఐసీసీకి తెలియంది కాదు. అందుకే, భారత్ కోసం చాంపియన్స్ ట్రోఫీని హైబ్రిడ్ మోడల్ లో నిర్వహించాలని ఐసీసీ భావిస్తోంది. భారత్ ఆడే మ్యాచ్ లను పాకిస్థాన్ లో కాకుండా మరో దేశంలో నిర్వహించాలన్నది ఐసీసీ ప్లాన్. దుబాయ్ లేదా శ్రీలంకలో తమ మ్యాచ్ లు ఏర్పాటు చేయాలని బీసీసీఐ కోరినట్టు తెలుస్తోంది. 

గతంలోనూ ఆసియా కప్ సందర్భంగా ఇదే సమస్య వస్తే... టీమిండియా మ్యాచ్ లను శ్రీలంకలో నిర్వహించారు. ఈసారి మాత్రం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ససేమిరా అంటోంది. పైగా, టీమిండియా తమ దేశంలో ఆడేలా బీసీసీఐని ఒప్పించే బాధ్యతను పీసీబీ ఇప్పుడు ఐసీసీకి అప్పగించింది. బీసీసీఐ వంటి సంపన్న క్రికెట్ బోర్డును ఒప్పించడం శక్తికి మించిన పని అని ఐసీసీకి తెలుసు. అందుకే భారత క్రికెట్ బోర్డును సంతృప్తి పరిచేలా హైబ్రిడ్ మోడల్ వైపే మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తోంది. 

ఎనిమిది అగ్రశ్రేణి జట్లు పాల్గొనే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ 2025 ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు పాకిస్థాన్ లో జరగనుంది. షెడ్యూల్ ప్రకారం టీమిండియా తన మ్యాచ్ లన్నింటిని లాహోర్ లోని గడాఫీ స్టేడియంలో ఆడాల్సి ఉంది.
Advertisement
Champions Trophy 2025
Hybrid Model
Team India
Pakistan
ICC

More Telugu News