ఇప్పటి వరకు 1301 మంది హజ్ యాత్రికుల మృతి

Death toll at Hajj pilgrimage rises to 1301
  • సౌదీలో విపరీత వేడి పరిస్థితుల కారణంగా విషాదం
  • హజ్ చరిత్రలో మూడో అతిపెద్ద విషాద ఘటన
  • మృతుల్లో 660 మంది ఈజిప్షియన్లు
  • 2015లో జరిగిన తొక్కిసలాటలో 2,400 మందకిిపైగా మృతి
ఈసారి హజ్‌యాత్ర తీరని విషాదాన్ని మిగిల్చింది. సౌదీ అరేబియాలో విపరీతమైన వేడి పరిస్థితుల కారణంగా 1301 మంది ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారిలో 83 శాతం మంది అనధికారికంగా వచ్చిన వారేనని సౌదీ ఆరోగ్యమంత్రి ఫహద్ బిన్ అబ్దుర్రహమాన్ అల్-జలాజెల్ తెలిపారు. 95 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, వీరిలో కొందరికి మరింత మెరుగైన చికిత్స అందించేందుకు రాజధాని రియాద్‌కు విమానంలో తరలించినట్టు పేర్కొన్నారు. చనిపోయిన వారిలో చాలామంది వద్ద సరైన పత్రాలు లేకపోవడంతో వారి గుర్తింపు ప్రక్రియ నెమ్మదిగా సాగుతున్నట్టు తెలిపారు. చనిపోయిన వారిని మక్కాలోనే ఖననం చేస్తున్నట్టు చెప్పారు. 

చనిపోయిన వారిలో 660 మంది ఈజిప్షియన్లు ఉన్నారు. వారిలో 31 మంది అనధికారికంగా వచ్చిన వారే. ఈసారి ఈజిప్టు నుంచి 50 వేల మంది యాత్రికులు మక్కాను సందర్శించారు. ఇక, మృతుల్లో 165 మంది ఇండోనేషియా వారు కాగా, 98 మంది భారతీయులు ఉన్నారు. జోర్డాన్, ట్యునీషియా, మొరాకో, అల్జీరియా, మలేసియాకు చెందిన వారు పదుల సంఖ్యలోనే ఉన్నారు. ఇద్దరు అమెరికా పౌరులు కూడా ప్రాణాలు కోల్పోయారు. 

హజ్‌యాత్ర సందర్భంగా 2015లో మక్కాలోని మినాలో జరిగిన తొక్కిసలాటలో 2,400 మందికిపైగా యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు ఇదే అతిపెద్ద ఘటన కాగా, అంతకుముందు 1990లో జరిగిన తొక్కిసలాటలో 1,426 మంది మృతి చెందారు. ఈసారి మక్కాలో 46 నుంచి 49 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో వేడిని భరించలేక 1300 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.
Advertisement
Saudi Arabia
Hajj Pilgrimage
Mecca
Mina Stampade

More Telugu News