ఇలాగైతే ఎలా బ్రతకాలమ్మా: నటి వైజాగ్ భువనేశ్వరి

Vizag Bhuvaneshwari Interview
  • విలనీ పాత్రలు చేసిన వైజాగ్ భువనేశ్వరి 
  • చిన్నప్పుడు చాలా కష్టాలు పడ్డానని వెల్లడి 
  • నాటకాలలో అనుభవం గురించి వివరణ 
  • ఇటీవల అవకాశాలు తగ్గాయని ఆవేదన 
  • సరైన పాత్రల కోసం వెయిట్ చేస్తున్నానని వ్యాఖ్య   

చిన్న సినిమాల్లో లేడీ విలనిజంతో కూడిన పాత్రలతో మెప్పించిన నటిగా వైజాగ్ భువనేశ్వరి కనిపిస్తారు. మొన్నామధ్య వచ్చిన 'పిండం' సినిమాలో పోషించిన పాత్ర కూడా ఆమెకి మంచి పేరు తెచ్చిపెట్టింది. తాజాగా 'ట్రీ మీడియా'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, తనకి సంబంధించిన అనేక విషయాలను గురించి ప్రస్తావించారు. " నా చిన్నతనంలోనే మా అమ్మ చనిపోయింది. ఆ తరువాత సవతి తల్లి చేతిలో నానా కష్టాలు పడ్డాను. ఆమె కొట్టిన గాయాల తాలూకు గుర్తులు ఇప్పటికీ ఉన్నాయి" అని అన్నారు. 

" ఇండస్ట్రీకి రాకముందు నేను నాటకాలు వేసేదానిని. రంగస్థల నటిగా నాకు చాలా మంచి గుర్తింపు ఉంది. 'స్రవంతి' సీరియల్ తో నేను సీరియల్స్ చేయడం మొదలుపెట్టాను. అప్పుడప్పుడు సినిమాలు చేస్తూనే, ఇంతవరకూ 82 సీరియల్స్ లో నటించాను. అప్పట్లో నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రలు చేయాలంటే ముందుగా నాకే కబురు చేసేవారు. మా ముఖంపై మచ్చలు ఎక్కువగా ఉంటాయి. అందువలన విలనీ పాత్రలు చేయడం వలన ఆడియన్స్ ఎక్కువగా భయపడేవారు" అని అన్నారు. 

" ఒకప్పుడు నెలకి 20 రోజులకి పైనే పని ఉండేది .. కానీ ఇప్ప్పుడు చిన్న చిన్న పాత్రల కోసం మాత్రమే పిలుస్తున్నారు. ఎక్కువగా ఇతర భాషల వారికి అవకాశాలు దక్కుతున్నాయి. అలాంటప్పుడు నాలాంటి వారు ఎలా బ్రతుకుతారు చెప్పండి? సరైన పాత్ర పడితే మళ్లీ బిజీ అవుతాననే నమ్మకం ఉంది. అలాంటి ఒక అవకాశం కోసమే ఎదురుచూస్తున్నాను" అని చెప్పారు.
Advertisement
Vizag Bhuvaneshwari
Actress
Tollywood

More Telugu News