ఆగస్టు 1 నుంచి రాయలసీమ ప్రాజెక్టుల సందర్శనకు చంద్రబాబు
- రాయలసీమలో చంద్రబాబు పర్యటన ఖరారైందన్న కాలవ శ్రీనివాసులు
- కర్నూలు, కడప తర్వాత ఆగస్టు 3న అనంతపురానికి వస్తారని వెల్లడి
- జగన్ వైఫల్యాలను ఎండగట్టేందుకే ఈ పర్యటన చేస్తున్నారని ప్రకటన
రాష్ట్రవ్యాప్తంగా సాగునీటి ప్రాజెక్టులపై పరిశీలన జరుగుతుందని కాలవ శ్రీనివాసులు ప్రకటించారు. రాయలసీమ భవిష్యత్తో సీఎం జగన్ ఆటలాడుకుంటున్నారని విమర్శించారు. కరవు జిల్లాలకు నీరు అందించే ప్రాజెక్టులను జగన్ ఆపేశారని ఆరోపించారు. సీఎం అసమర్థత వల్ల రాయలసీమలో వేరుశనగ పంట దిగుబడి తగ్గిందని మండిపడ్డారు.
రాయలసీమ జీవనాడి లాంటి హంద్రీనీవా వెడల్పును ఈ ప్రభుత్వం ఆపేసిందని, పది వేల క్యూసెక్కుల సామర్థ్యంతో నిర్మిస్తానని చెప్పి టెండర్లు కూడా పిలవలేదని మండిపడ్డారు. జరిగే పనులు ఆపివేసి అనంతపురం జిల్లాకు తీవ్ర అన్యాయం చేశారన్నారు. జిల్లా మనుమడినని చెప్పి ముఖ్యమంత్రి ప్రాజెక్టులు ఆపివేసి నయవంచనకు గురి చేస్తున్నారని దుయ్యబట్టారు.
జగన్ వైఫల్యాలను ఎందగట్టేందుకు చంద్రబాబు పర్యటన చేయనున్నారని తెలిపారు. రైతులు పెద్ద ఎత్తున పాల్గొని చంద్రబాబు పర్యటనను విజయవంతం చేయాలని కోరారు. జగన్ దుర్మార్గాలు, అవినీతిని ఎండగడతామని హెచ్చరించారు.