Advertisement

చెక్ బౌన్స్ కేసులో కోర్టులో లొంగిపోయిన అమీషా పటేల్

Ameesha Patel surrenders in Ranchi court
  • అమీషాపై కోర్టును ఆశ్రయించిన నిర్మాత అజయ్ కుమార్
  • రూ.2.5 కోట్ల ఎగవేతకు పాల్పడినట్టు ఫిర్యాదు
  • వడ్డీతో కలిపి రూ.3 కోట్లు చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ దాఖలు
  • ఏప్రిల్ 6న అమీషాపై వారెంట్ జారీ చేసిన రాంచీ కోర్టు
బాలీవుడ్ నటి అమీషా పటేల్ ఓ చెక్ బౌన్స్ కేసులో నేడు ఝార్ఖండ్ లోని రాంచీ కోర్టులో లొంగిపోయారు. సినిమా ప్రొడక్షన్ పేరిట అమీషా పటేల్ తన నుంచి రెండున్నర కోట్ల రూపాయలు అప్పుగా తీసుకుని, తన డబ్బు ఎగ్గొట్టారని నిర్మాత, వ్యాపారవేత్త అజయ్ కుమార్ రాంచీ కోర్టును ఆశ్రయించారు. 

అమీషా పటేల్ సినిమా పూర్తి చేయకపోగా, తన డబ్బు తిరిగి ఇవ్వలేదని, అసలు రూ.2.5 కోట్లకు వడ్డీ రూ.50 లక్షలు అయిందని, మొత్తం రూ.3 కోట్లు చెల్లించేలా అమీషా పటేల్ ను ఆదేశించాలని అజయ్ కుమార్ కోర్టును కోరారు. 

నిర్మాత పిటిషన్ ను పరిగణనలోకి తీసుకున్న రాంచీ కోర్టు ఈ ఏప్రిల్ 6న అమీషా పటేల్ పై వారెంట్ జారీ చేసింది. కోర్టు ఆదేశాల నేపథ్యంలో ఇవాళ రాంచీ వచ్చిన అమీషా పటేల్ న్యాయమూర్తి ఎదుట లొంగిపోయారు. అనంతరం ఆమెకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. కాగా, కోర్టు వెలుపల మీడియా హడావిడి చూసిన అమీషా తలపై ముసుగు కప్పుకుని కారెక్కి వెళ్లిపోయారు. 

అమీషా పటేల్ తెలుగులో పవన్ కల్యాణ్ సరసన బద్రి సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆమె మళ్లీ తెలుగులో కనిపించలేదు.
Advertisement
Ameesha Patel
Ranchi Court
Cheque Bounce
Ajay Kumar
Bollywood

More Telugu News