Chandrababu: మేం అధికారంలో ఉండి ఉంటే పోలవరం ఎప్పుడో పూర్తయ్యేది: చంద్రబాబు

Chandrababu on Polavaram project
షార్ట్స్‌లో చూడండి
నవ్యాంధ్ర ప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చి ఉంటే 2020 జూన్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తయి ఉండేదని ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. నదులు అనుసంధానిస్తే రాష్ట్రంలో ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చే వీలు కలుగుతుందని భావించామని, అందులో భాగంగానే రూ.64 వేల కోట్ల ఖర్చుతో సాగునీటి ప్రాజెక్టులు చేపట్టినట్లు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు 72 శాతం పూర్తి చేశామన్నారు. 2025 నాటికి ఫేజ్ 1 పూర్తి చేస్తామని జగన్ ప్రభుత్వం సిగ్గులేకుండా చెబుతోందని, ఇక ప్రాజెక్టు పూర్తి కావడానికి ఎన్నేళ్లు పడుతుందో చెప్పలేని దుస్థితి ఏర్పడిందన్నారు. ప్రజల జీవనాడి పోలవరాన్ని సర్వనాశనం చేసి ఏపీ ప్రగతిని, భవిష్యత్తును అడ్డుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

తెలుగు ప్రజలు ఎక్కడున్నా అగ్రస్థానంలో ఉండాలని చంద్రబాబు అన్నారు. తెలుగు ప్రజల కోసం నిరంతరం టీడీపీ శ్రమించిందన్నారు. ఎన్టీఆర్ తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పారని, ఏపీలో రెండో తరం సంస్కరణలు తీసుకు వచ్చామన్నారు. దేశానికి దశ, దిశ నిర్దేశించిన వ్యక్తి పీవీ నరసింహారావు అన్నారు. 1991లో ఆర్థిక సంస్కరణలకు నాంది పలికిన పీవీ లాంటి వ్యక్తి తెలుగువారిగా మనకు గర్వకారణమన్నారు. నాడు సమైక్యాంధ్ర అభివృద్ధి కోసం కృషి చేసినట్లు చెప్పారు. నాలెడ్జ్ ఎకానమీకి ఐటీ నాంది పలుకుతుందని తాను ఆనాడే చెప్పానని, సంస్కరణలకు టెక్నాలజీని జోడించి ముందుకెళ్లినట్లు చెప్పారు.

విభజన తర్వాత నవ్యాంధ్రను అభివృద్ధి దిశగా పాలించినట్లు చెప్పారు. విభజన సమయంలో ఏపీకి రూ.1.10 లక్షల కోట్ల అప్పు వచ్చిందని, రూ.16వేల కోట్లు లోటు బడ్జెట్ తో వచ్చిందన్నారు. సవాళ్లను అధిగమించి 2029 విజన్ డాక్యుమెంట్ రూపొందించినట్లు చెప్పారు. 2029 నాటికి దేశంలో ఏపీ నంబర్ వన్ గా ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. టీడీపీ హయాంలో ఏపీ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో వరుసగా అగ్రస్థానంలో నిలిచిందన్నారు. కానీ ఇప్పుడు ఐటీ ఎగుమతులు సహా వివిధ రంగాల్లో తెలంగాణ కంటే వెనుకబడిందన్నారు.
Go Back to Shorts
Chandrababu
Telugudesam
Polavaram Project

More Telugu News