శాంసన్ ఉతికితే... హెట్మెయర్ ఆరేశాడు... రివెంజ్ మ్యాచ్ లో రాజస్థాన్ గెలుపు
- గత ఐపీఎల్ ఫైనల్లో రాజస్థాన్ ను ఓడించిన టైటాన్స్
- ఇవాళ ప్రతీకారం తీర్చుకున్న రాజస్థాన్ రాయల్స్
- 3 వికెట్ల తేడాతో టైటాన్స్ పై విజయం
- 26 బంతుల్లో 56 పరుగులు చేసిన హెట్మెయర్
- అంతకుముందు విధ్వంసం సృష్టించిన సంజూ శాంసన్
రాజస్థాన్ బ్యాట్స్ మన్ షిమ్రోన్ హెట్మెయర్ అద్భుత బ్యాటింగ్ తో గుజరాత్ టైటాన్స్ కు చుక్కలు చూపించాడు. హెట్మెయర్ 26 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సులతో 56 పరుగుల చేసి అజేయంగా నిలిచాడు. చివర్లో ఓ సిక్స్ కొట్టి రాజస్థాన్ రాయల్స్ కు గెలుపును ఖాయం చేశాడు.
అసలు, లక్ష్యఛేదనలో రాజస్థాన్ జట్టు నిలిచిందంటే అందుకు కారణం కెప్టెన్ సంజూ శాంసనే. సంజూ విధ్వంసక బ్యాటింగ్ తో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ కేవలం 32 బంతుల్లో 60 పరుగులు చేసి టైటాన్స్ గుండెల్లో రైళ్లు పరిగెత్తించాడు. అతడి స్కోరులో 3 ఫోర్లు, 6 భారీ సిక్సర్లు ఉన్నాయి.
అంతకుముందు, ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (1), జోస్ బట్లర్ (0) పేలవంగా అవుటయ్యారు. ఆ తర్వాత శాంసన్ తుపానులా చెలరేగి అర్ధసెంచరీ సాధించాడు. అతడు అవుట్ కావడంతో రాజస్థాన్ గెలుపుపై సందేహాలు ఏర్పడ్డాయి. కానీ లోయరార్డర్ అండతో హెట్మెయర్ చితక్కొట్టేశాడు. ధృవ్ జురెల్ 18, అశ్విన్ 10 పరుగులు చేసి తమ వంతు సహకారం అందించారు.
కాగా, రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్ మెన్ మాంచి ఊపుమీదుకు వచ్చారనుకునే లోపు అవుట్ కావడంతో, మ్యాచ్ టైటాన్స్ వైపు మొగ్గినట్టు అనిపించింది. కానీ హెట్మెయర్ మాత్రం డిఫెండింగ్ చాంపియన్స్ టైటాన్స్ కు ఆ అవకాశం ఇవ్వకుండా సిక్స్ తో మ్యాచ్ ను ముగించాడు. గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో షమీ 3, రషీద్ ఖాన్ 2, హార్దిక్ పాండ్యా 1, నూర్ అహ్మద్ 1 వికెట్ తీశారు.